manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 December 2025, 3:58 pm Editor : manabharath

నేడు ఇచ్చోడలో పర్యటించనున్న ఎంపీ గోడం నగేష్..

 డిసెంబర్ 28న ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’

– ఇచ్చోడలో పాల్గొనున్న ఎంపీ గోడం నగేష్

మన భారత్, ఆదిలాబాద్ :
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రతిష్ఠాత్మక రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ ఈ నెల డిసెంబర్ 28, 2025 (ఆదివారం) న నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ తన ప్రసంగం ద్వారా పలు కీలక అంశాలపై అభిప్రాయాలను వెల్లడించనున్నారు.

ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక-ఆర్థిక పురోగతి, సాంస్కృతిక విలువలు, యువత పాత్ర, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రధాని విశ్లేషణ చేస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రజలతో నేరుగా సంభాషించే వేదికగా ‘మన్ కీ బాత్’ దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది.

తెలంగాణ రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం DD సప్తగిరి ఛానల్‌లో ఉదయం 11:30 గంటల నుంచి 12:00 గంటల వరకు తెలుగులో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోడం నగేష్ గారు ప్రజలకు ప్రత్యేక పిలుపునిస్తూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించి ప్రధాని సందేశాన్ని అవగాహన చేసుకోవాలని కోరారు. ‘మన్ కీ బాత్’ దేశ ప్రజల ఆలోచనలు, ఆశయాలను పాలనతో అనుసంధానించే అరుదైన కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా, ఇచ్చోడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్ గారు స్వయంగా పాల్గొననున్నట్లు బిజేపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, తాంసి మాజీ జడ్పీటీసీ తాటిపెల్లి రాజు తెలిపారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి కార్యక్రమాన్ని వీక్షించి ప్రధాని ప్రసంగాన్ని విననున్నారని వెల్లడించారు.

ప్రజల అనుభవాలు, విజయగాథలను దేశవ్యాప్తంగా పంచుకుంటూ స్ఫూర్తినిచ్చే ఈ కార్యక్రమం ప్రతి భారతీయుడికి ప్రేరణగా నిలుస్తోందని నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.