ఒకేసారి పట్టణ స్థానిక సంస్థల పోలింగ్కు ప్రభుత్వం కసరత్తు
మన భారత్, తెలంగాణ:
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఫిబ్రవరిలో గడువు ముగియనున్న జీహెచ్ఎంసీతో పాటు మిగిలిన పట్టణ స్థానిక సంస్థలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. విద్యార్థుల పరీక్షల సీజన్ ప్రారంభమయ్యేలోగానే ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లు, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లోని రెండు మున్సిపాలిటీల పాలకవర్గాలకు ఇంకా ఏప్రిల్ వరకు గడువు ఉండటంతో, వాటిని ఈ ఎన్నికల నుంచి మినహాయించనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన మున్సిపాలిటీల్లో మాత్రమే ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. జనవరి రెండో వారంలోపే ఓటర్ల జాబితాల తయారీ, సవరణ పనులను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, అభ్యంతరాల స్వీకరణ వంటి ప్రక్రియలను వేగవంతం చేయనున్నట్లు సమాచారం.
మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల్లోనూ కదలిక మొదలైంది. అభ్యర్థుల ఎంపిక, వ్యూహాల రూపకల్పనపై పార్టీలు దృష్టిసారించాయి. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముండటంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం పెరిగింది.