తలమడుగులో విశ్వవాణి ప్రార్థన మందిరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు గ్రామంలోని విశ్వవాణి ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసుక్రీస్తును మనసారా ఆరాధించి, ఆయన జన్మదినాన్ని ఆనందోత్సాహాలతో ఘనపరిచారు. ప్రార్థనలు, గీతాలు, సందేశాలతో మందిరం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.ఈ సందర్భంగా పాస్టర్ సామ్యూల్ గోదారి ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ ప్రాధాన్యతను వివరిస్తూ ప్రేమ, శాంతి, సేవా భావనలే క్రీస్తు బోధల సారమని పేర్కొన్నారు. సంగపెద్ద రాంపాల్ మునుగోటి సంఘ సభ్యులు, సంఘ పెద్దలు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
గ్రామ సర్పంచ్ ఎలుగు రాజన్న (చంటి) కూడా కార్యక్రమానికి హాజరై క్రైస్తవ సోదరులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మతాల మధ్య సౌహార్దం, పరస్పర గౌరవంతో గ్రామం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం సర్పంచును శాలువాలతో ఘనంగా సత్కరించారు.
క్రిస్మస్ సందర్భంగా చిన్నారులు, యువత ప్రత్యేక గీతాలు ఆలపించగా, సంఘ సభ్యులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకలు గ్రామంలో ఐక్యతను, సామరస్యాన్ని మరింత బలపరిచాయని పాల్గొన్నవారు తెలిపారు.