manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 December 2025, 12:15 pm Editor : manabharath

పత్తి చేనులో క్రీడా ప్రాంగణం.!

పాలోడి గ్రామంలో క్రీడా ప్రాంగణం నిర్వీర్యం…

-పత్తి పంటతో ఆటలకు అడ్డంకి

మన భారత్ , తాంసి :  మండలంలోని పాలోడి గ్రామంలో గ్రామ యువతకు ఉపయోగపడాల్సిన క్రీడా ప్రాంగణం అలంకారప్రాయంగా మారింది. క్రీడలు ఆడేందుకు అనువైన మైదానంగా ఉండాల్సిన ప్రాంగణంలో ప్రస్తుతం పత్తి పంట దర్శనమిస్తుండటంతో యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గ్రామంలో యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు క్రీడా ప్రాంగణం ఎంతో కీలకమైనది. అయితే, నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా మైదానం క్రీడలకు కాకుండా సాగుకు ఉపయోగపడే స్థితికి చేరిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుట్‌బాల్, క్రికెట్ వంటి ఆటలు ఆడాలంటే సరైన స్థలం లేక యువకులు ఇతర గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వారు తెలిపారు.

క్రీడా ప్రాంగణం చుట్టూ కంచె ఏర్పాటు చేయకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో ఏర్పాటైన ప్రాంగణం ఈ విధంగా ఉపయోగం లేకుండా పోవడం దురదృష్టకరమని, వెంటనే అధికారులు స్పందించి మైదానాన్ని శుభ్రపరచి ఆటలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని గ్రామ యువత డిమాండ్ చేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. కనీసం ఉన్న క్రీడా సదుపాయాలనైనా కాపాడుకుంటే యువతకు మంచి అవకాశాలు లభిస్తాయని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.