జాతీయ గౌరవ పురస్కారానికి సాహితీవేత్త సుకుమార్ పేట్కులే ఎంపిక
మన భారత్ ,ఆదిలాబాద్ : ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కవి, హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు, అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హిందీ ఉపాధ్యాయులు సుకుమార్ పేట్కులే కు భారతీయ సంవిధాన్ సన్మానం – జాతీయ గౌరవ పురస్కారం 2025కు ఎంపికైనట్లు కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు ఆనంద్ భగత్ తెలిపారు.
ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని డిసెంబర్ 28న ఆదివారం మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా భద్రావతిలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. జాతీయ స్థాయిలో బహుజన సాహిత్యం, బహుజనోద్ధరణ కోసం విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ పురస్కారాలను అందజేస్తుండగా, అందులో భాగంగా సుకుమార్ పేట్కులేను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షులు శివదాస్ మహాజన్, కార్యక్రమ నిర్వాహకులు ఆనంద్ భగత్ ల చేతుల మీదుగా సాహిత్య, సామాజిక సేవలకు గాను ఈ అవార్డును సుకుమార్ పేట్కులే అందుకోనున్నారు.
ఈ సందర్భంగా సుకుమార్ పేట్కులే మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు ఫులే దంపతులు సామాజిక న్యాయం, సమసమాజ నిర్మాణం, బడుగు–బలహీన వర్గాల అభివృద్ధి, స్త్రీ విద్య కోసం చేసిన సేవలు తనకు స్ఫూర్తినిచ్చాయని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా తెలుగు–హిందీ భాషల్లో అనువాదాలు చేస్తూ వాటిని ప్రచురించడం ద్వారా విద్యార్థుల్లో, మేధావుల్లో, ముఖ్యంగా బహుజన వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. ఆ సేవలకు గుర్తింపుగా ఈ జాతీయ అవార్డు లభించడం తనకు అపార ఆనందాన్ని కలిగిస్తోందని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో సాహిత్య, సామాజిక సేవా రంగాల్లో కొనసాగుతానని పేర్కొన్నారు.
ఈ అవార్డు ఎంపికపై ఆదిలాబాద్ జిల్లా సాహితీవేత్తలు, ప్రముఖ సాహితీవేత్త మధు బావల్కర్తో పాటు పలువురు మేధావులు సుకుమార్ పేట్కులేకు అభినందనలు తెలిపారు.