manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 December 2025, 1:56 pm Editor : manabharath

ఆర్మీ సుబేదార్ మేజర్ ఉత్తమ్ రావ్‌కు శ్రద్ధాంజలి..

ఆర్మీ సుబేదార్ మేజర్ ఉత్తమ్ రావ్‌కు శ్రద్ధాంజలి ఘటించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్

మన భారత్, ఆదిలాబాద్ :తలమడుగు మండలం కుచ్లాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ సుబేదార్ మేజర్ ఉత్తమ్ రావ్ ఇటీవల మృతి చెందడం పట్ల బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుచ్లాపూర్‌లోని ఉత్తమ్ రావ్ స్వగృహాన్ని సందర్శించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం ఉత్తమ్ రావ్ సతీమణి వేణు తాయి రావ్, కుమార్తె ప్రేరణ జయదీప్ దాస్‌లను పరామర్శించి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ, ఒక సాధారణ పల్లెటూరి నేపథ్యం నుంచి కష్టపడి చదివి సైనిక ఉన్నతాధికారిగా ఎదిగి దేశానికి ఎనలేని సేవలు అందించిన ఉత్తమ్ రావ్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని గ్రామ యువత దేశ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.

అలాగే ఉత్తమ్ రావ్ కుటుంబానికి రావలసిన పెన్షన్ తదితర ప్రయోజనాలు వేగంగా అందేలా అవసరమైన పత్రాలను వెంటనే సిద్ధం చేయాలని తలమడుగు ఎమ్మార్వో, పంచాయతీ సెక్రటరీలకు ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రభుత్వం తరఫున కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జక్కుల మహేందర్, మేకల సదాశివ్, దారట్ల జనార్ధన్,  తోట శ్రీనివాస్, ప్రధాన్ వామన్, బుయ్యని గంగారెడ్డి, ముడుపు కేదారేశ్వర్ రెడ్డి, కుటుంబ సభ్యులు దారట్ల విజయ్, దారట్ల స్వప్నిల్, దారట్ల సంజీవ్, కుచ్లాపూర్ సర్పంచ్ మోడెపు వెంకన్న, ఉప సర్పంచ్ రాగి దీపక్ తదితరులు పాల్గొన్నారు.