గ్రామ పంచాయతీ నిధుల నిర్వహణకు కొత్త డిజిటల్ రూల్స్
మన భారత్, హైదరాబాద్: గ్రామ పంచాయతీల నిధుల వినియోగంలో పారదర్శకత, బాధ్యతను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త డిజిటల్ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై గ్రామ పంచాయతీల్లో నిధుల నిర్వహణ పూర్తిగా డిజిటల్ విధానంలోనే జరగనున్నట్లు స్పష్టం చేసింది.
15వ ఆర్థిక సంఘం (XV-FC), రాష్ట్ర ఆర్థిక సంఘం (SFC) గ్రాంట్ల నిధుల వినియోగంలో మాన్యువల్ చెల్లింపులకు పూర్తిగా గుడ్బై చెప్పనుంది. అన్ని లావాదేవీలు తప్పనిసరిగా PFMS, ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్ ద్వారా మాత్రమే జరగాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ, మండల పరిషత్ పేరు మీద రెండు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరవాల్సి ఉంటుంది. ఒకటి 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం, మరొకటి రాష్ట్ర గ్రాంట్ల కోసం వినియోగించాలి. ఇతర పథకాల నిధులను ఈ ఖాతాలతో కలపరాదని స్పష్టం చేసింది.
చెల్లింపుల ఆమోదానికి జాయింట్ డిజిటల్ సంతకాల (DSC) విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందులో రెండు అంచెల వ్యవస్థ ఉంటుంది. వోచర్ తయారీ బాధ్యత మేకర్గా ఉప సర్పంచ్ లేదా MPDOకి ఉండగా, తుది ఆమోదం చెకర్గా సర్పంచ్ లేదా మండల పరిషత్ అధ్యక్షులు ఇవ్వాల్సి ఉంటుంది.
గ్రామ పంచాయతీ నిధుల వినియోగానికి గ్రామసభ తీర్మానం తప్పనిసరి చేశారు. అలాగే కొత్తగా ఏర్పడిన పంచాయతీలు LGD కోడ్తో PFMSలో నమోదు కావాలని, పనులు చేపట్టే విక్రేతలు కూడా పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసి ప్రజలకు పూర్తి స్థాయి పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో ఈ డిజిటల్ పర్యవేక్షణ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. సర్పంచ్, ఉప సర్పంచ్ల ఉమ్మడి డిజిటల్ ఆమోదంతోనే చెల్లింపులు జరగనున్నాయని మంత్రి సీతక్క సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
