అప్పుల ఒత్తిడితో నిండు సంసారం బలి.. సిద్దిపేటలో దంపతుల ఆత్మహత్య
మన భారత్, సిద్దిపేట: స్నేహితులకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో మధ్యవర్తిగా నిలిచి అప్పులు ఇప్పించిన ఓ యువకుడి కుటుంబం చివరికి అప్పుల భారానికి, వేధింపులకు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో మూడుేళ్ల చిన్నారి అనాథగా మారింది.
దాచారం గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీహర్ష (32), రుక్మిణి (25) దంపతులు బెజ్జంకిలో బట్టల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి హరిప్రియ అనే మూడేళ్ల కుమార్తె ఉంది. శ్రీహర్ష తనకు తెలిసిన స్నేహితులు, పరిచయస్తులకు మధ్యవర్తిగా ఉండి సుమారు రూ.13 లక్షల వరకు అప్పులు ఇప్పించారు. అయితే అప్పు తీసుకున్న వారు డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. మరోవైపు డబ్బు ఇచ్చిన వారి నుంచి శ్రీహర్షపై ఒత్తిడి, వేధింపులు పెరిగినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులిద్దరూ ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న తల్లిదండ్రులను చూసి చిన్నారి హరిప్రియ గట్టిగా కేకలు వేయడంతో ఇంటి యజమాని అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా రుక్మిణి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. శ్రీహర్షను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారికి విషం ఇచ్చారేమో అన్న అనుమానంతో వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ రవీందర్రెడ్డి శ్రీహర్ష రాసిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన చావుకు కారణమైన ఐదుగురి పేర్లను ప్రస్తావించినట్లు సమాచారం. అప్పుల వేధింపులే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోస్టుమార్టం అనంతరం స్వగ్రామమైన దాచారంలో శ్రీహర్ష, రుక్మిణి దంపతుల మృతదేహాలకు ఒకే చితిపై అంత్యక్రియలు నిర్వహించారు. నిండు సంసారం ఇలా అర్ధాంతరంగా ముగియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు లేని చిన్నారి భవితవ్యంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.