manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 1:15 pm Editor : manabharath

ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు పై క్లారిటీ..!

ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు కాదు.. ప్రభుత్వం స్పష్టత

మన భారత్, తెలంగాణ: ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేశారనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా కొంత గందరగోళం నెలకొంది. ఇటీవల కొత్తగా ఏర్పడిన పంచాయతీలు, మండలాల పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించి ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఈ అకౌంట్ల నుంచి జరిగే చెల్లింపులు పంచాయతీ కార్యదర్శి లేదా ఎంపీడీఓ, అలాగే సర్పంచ్ లేదా ఎంపీపీ డిజిటల్ సంతకాలతోనే నిర్వహించాలని ఆ మెమోలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో అధికారుల వర్గాలు, మీడియా వాట్సాప్ గ్రూపుల్లో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ పూర్తిగా రద్దు చేశారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉప సర్పంచ్లలో ఆందోళన వ్యక్తమైంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రభుత్వం జారీ చేసిన మెమోలో ఉప సర్పంచ్ చెక్ పవర్‌ను పూర్తిగా తొలగించినట్లు ఎక్కడా పేర్కొనలేదని అధికారులు చెబుతున్నారు. కేవలం 15వ ఆర్థిక సంఘం నిధుల పారదర్శక వినియోగం, ఆన్‌లైన్ చెల్లింపుల సౌలభ్యం కోసం మాత్రమే డిజిటల్ సంతకాల విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. సంప్రదాయంగా కొనసాగుతున్న చెక్ విధానంలో ఉప సర్పంచ్ పాత్ర యథాతథంగానే ఉంటుందని స్పష్టతనిచ్చారు.

అందువల్ల ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దయ్యిందన్న వార్తలు అవాస్తవమని, అనవసర గందరగోళానికి తావివ్వకుండా అధికారిక ఉత్తర్వులను మాత్రమే ఆధారంగా తీసుకోవాలని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారు.