జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి స్పష్టం
మన భారత్, హైదరాబాద్: జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్. కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) జిల్లా మహాసభలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల అత్యవసరంగా హైదరాబాద్ వెళ్లాల్సి రావడంతో ఫోన్ ద్వారా జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయాలను వివరించారు.
త్వరలో అక్రిడిటేషన్ కార్డులు
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అక్రిడిటేషన్ కార్డుల ప్రక్రియ తుది దశకు చేరుకుందని మంత్రి తెలిపారు. రాబోయే పది రోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (GO) విడుదల చేస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.
ఇళ్ల స్థలాలపై తీపి కబురు
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇప్పటికే విస్తృతంగా చర్చించామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు, న్యాయపరమైన అడ్డంకుల కారణంగా కొంత ఆలస్యం జరిగినా, వాటన్నింటినీ అధిగమించి వచ్చే ఏడాది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం తరపున తీపి కబురు అందిస్తామని తెలిపారు. జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యతని ఆయన స్పష్టం చేశారు.
సమిష్టి పోరాటంతో ముందుకు
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించుకోవడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం నాయకులు, సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.