పార్లమెంటులో నేడు ‘వందేమాతరం’పై చారిత్రక చర్చ!
మన భారత్, న్యూఢిల్లీ: జాతీయ గేయం ‘వందేమాతరం’ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని పార్లమెంట్ ఉభయ సభలు ఇవాళ ప్రత్యేక చర్చకు సిద్ధమయ్యాయి. స్వాతంత్ర్య సమరయోధులకు స్పూర్తినిచ్చిన ఈ గేయ చారిత్రక ప్రాముఖ్యతను గుర్తుందుకు తెచ్చే విధంగా ప్రభుత్వం విస్తృత చర్చను నిర్వహిస్తోంది.
🔹 మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో ప్రధాని మోదీ ప్రారంభం
లోక్సభలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ చర్చను ప్రారంభించనున్నారు. దేశభక్తి, జాతి చైతన్యానికి ప్రతీకైన వందేమాతరం ఆవిర్భావం, స్వాతంత్ర్య ఉద్యమంలో దాని పాత్రపై మోదీ విస్తృతంగా ప్రసంగించనున్నట్లు పార్లమెంటరీ వర్గాలు తెలిపాయి. ఈ చర్చ పూర్తి 10 గంటల పాటు కొనసాగనుంది.
🔹 రాజ్యసభలో అమిత్ షా ప్రారంభం
రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చను ఆరంభించనున్నారు. వందేమాతరం పాడిన పూట దేశంలో చెలరేగిన జాతీయతా భావాన్ని, 150 ఏళ్ల ప్రయాణాన్ని, దీనికి సంబంధించిన సాంస్కృతిక పరంపరను ఆయన వివరించనున్నారు.
🔹 చర్చలో పాల్గొనబోయే పలువురు ఎంపీలు
దేశ స్వాతంత్ర్య పోరాటానికి బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఈ గేయం అందించిన స్ఫూర్తి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చెలరేగిన పోరాటాల్లో దీనిచ్చిన ఉత్సాహం, దీని సాహిత్య విశిష్టతపై పలువురు సభ్యులు వేదికపై మాట్లాడనున్నారు.
ఎంపీలు ఈ గేయం దేశ ఆత్మను ప్రతిబింబిస్తుందనే అంశాన్ని వివరించేందుకు సిద్ధమవుతున్నారు.
🔹 150 ఏళ్ల ‘వందేమాతరం’—భారత గౌరవ ప్రతీక
పార్లమెంట్ భవనంలో తొలిసారిగా ఇలా సుదీర్ఘంగా జాతీయ గేయంపై ప్రత్యేక చర్చ జరగడం చారిత్రాత్మకమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ సందర్బంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.