పిల్లలు సినిమాల పిచ్చిలో పడకూడదు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
మన భారత్, అమరావతి: సినిమాలు వినోద ప్రపంచంలో ఒక భాగమే తప్ప జీవిత లక్ష్యాలను మరిచిపోయేలా చేసే వ్యసనంగా మారకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. అమరావతిలో నిర్వహించిన ప్యారెంట్స్–టీచర్స్ మీటింగ్ (PTM) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పిల్లలు చదువుపై దృష్టి సారించేందుకు తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని, చిన్న వయసులోనే సినిమాల పిచ్చి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ చెప్పారు. గతంలో విద్యార్ధుల భవిష్యత్తు కోసం దాతలు వందల ఎకరాలు భూదానం చేసిన రోజులు గుర్తుచేస్తూ… నేడు స్కూళ్లకు గ్రౌండ్స్ కూడా లేకుండా మారుతున్న పరిస్థితులు ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.
“సోషల్ టీచర్ చెప్పిన పాఠాలు నా గుండెల్లో నాటుకుపోయాయి. అవే నాలో సామాజిక బాధ్యతను పెంచాయి” అని పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యకు ప్రాధాన్యం ఇస్తేనే సమాజం పురోగమిస్తుందని ఆయన పేర్కొన్నారు.