manabharath.com
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 2:51 pm Editor : manabharath

కేసీఆర్ కుటుంబంలో కాసుల పంచాయతీ..

కేసీఆర్ కుటుంబంలో కాసుల పంచాయితీ… సీఎం రేవంత్ రెడ్డి 

మన భారత్, ఆదిలాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో అవినీతి, కుటుంబ ప్రయోజనాలే జరిగాయని ఆరోపిస్తూ, “కేసీఆర్ చేసిన పాపం ఊరికే పోదు. వారి కుటుంబంలో కాసుల పంచాయితీ తప్ప ప్రజల కోసం చేసిన పని లేదు”ని ఎద్దేవా చేశారు.

ఆదిలాబాద్ పర్యటనలో జరిగిన ప్రజాసభలో మాట్లాడుతూ, “ప్రజల సొమ్ము దోచుకుంటే ఎవరూ బాగుపడే చరిత్ర లేదు. ఒక పెద్దాయన ఆదిలాబాద్‌ను దెయ్యంలా పట్టేశాడు. కాళేశ్వరం కట్టితే కూలేశ్వరం అయ్యింది… కానీ వారింట్లో కాసులే కురిశాయి” అంటూ సెటైర్లు చేశారు.


గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలించిందని మండిపడ్డారు.
“గత ప్రభుత్వం నిరంకుశంగా నడిచింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడే అవకాశం కూడా లేదు. సచివాలయ గేట్లకు తాళం వేసిన రోజులు ప్రజలు మరచిపోలేరు” అన్నారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతుండగా ఒక రోజూ విశ్రాంతి తీసుకోలేదని తెలిపారు.
“ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు… ఆ తర్వాత అభివృద్ధే మన లక్ష్యం” అని చెప్పారు.


ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్ – ఏడాదిలో పనులు ప్రారంభం

ఆదిలాబాద్ ప్రజలు పెద్దకాలంగా కోరుతున్న ఎయిర్‌పోర్టు విషయంలో సీఎం కీలక ప్రకటన చేశారు.

“వరంగల్‌తో పాటు ఆదిలాబాద్‌లో కూడా అన్ని సౌకర్యాలతో కూడిన ఎయిర్‌పోర్టు నిర్మాణం మొదలుపెడతాం. ఏడాదిలోపు పనులు ప్రారంభం అవుతాయి. ఎయిర్‌పోర్టు వస్తే పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున పెరుగుతాయి” అని తెలిపారు.

అంతేకాక, “ఎర్రబస్సే కాదు… ఆదిలాబాద్‌కు ఎయిర్‌బస్సు కూడా తీసుకొస్తాం” అని హామీ ఇచ్చారు.


అభివృద్ధి పరంగా కీలక నిర్ణయాలు

సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ అభివృద్ధికి పలు కీలక ప్రకటనలు చేశారు:

🔹 ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునఃప్రారంభం

“తమ్మిడిహట్టిలో ప్రాణహిత–చేవెళ్ల కట్టితీరుతాం. ప్రారంభోత్సవానికి నేనే వస్తా” అని స్పష్టం చేశారు.

🔹 ఇంద్రవెల్లిని ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి

ఇంద్రవెల్లి ప్రాంతంలో పర్యాటక వసతులు, అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.

🔹 ఆదిలాబాద్‌లో యూనివర్సిటీ ఏర్పాటు

“యూనివర్సిటీ తప్పకుండా కడతాం. ఎక్కడ కట్టాలో స్థానిక నేతలే నిర్ణయించాలి. నా అభిప్రాయం ఇంద్రవెల్లి మంచిదనేది మాత్రమే” అన్నారు.

🔹 భారీ ఉద్యోగాలు

గత రెండు సంవత్సరాల్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలోనే మరో 40,000 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
“మన యువత ఐఏఎస్, ఐపీఎస్‌లు అయితేనే నాకు నిజమైన సంతోషం” అని సీఎం పేర్కొన్నారు.