manabharath.com
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 2:57 pm Editor : manabharath

మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం..

మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం – తాంసి మండలంలో అభివృద్ధికి గ్రామస్థుల ఏకైక నిర్ణయం

మన భారత్, తాంసి: తాంసి మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైన తరుణంలో, మూడు గిరిజన గ్రామాలు ఏకగ్రీవ పతాకాలు ఎగురవేశాయి. అందులో అంబుగామ, లీంగూడ, అట్నం గూడ గ్రామాలు ఐక్యతకు నిలువెత్తు దర్పణాలుగా నిలిచాయి. మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా 89 మంది సర్పంచ్ అభ్యర్థులు, 222 మంది వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు.

అంబుగామా ఏకగ్రీవం..
అంబుగామా గ్రామ సర్పంచ్‌గా ఆత్రం తూర్పబాయి యశ్వంత్ రావును, ఉప సర్పంచ్‌గా ఆత్రం భరత్‌ను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అభివృద్ధి దిశగా కలిసి ముందుకు వెళ్లాలనే గ్రామస్థుల అభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు.

లింగూడలో సామరస్య వాతావరణం..
లింగూడ గ్రామ సర్పంచ్‌గా తొడసం సంబు, ఉప సర్పంచ్‌గా మడావి భుజంగ్ రావును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. గ్రామాభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్న దృష్టితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెద్దలు తెలిపారు.

అట్నం గూడలో ఏకగ్రీవ విజయం..
అట్నం గూడ సర్పంచ్‌గా అత్రం సంజీవ్, ఉప సర్పంచ్‌గా కుమ్ర అజయ్‌ను గ్రామ ప్రజలు ఒకే స్వరంతో ఎన్నుకున్నారు. గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రజలు ఆశలు వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క గిరిగామలో మాత్రం పోటీ వేడి
గిరిజన గ్రామాలన్నీ ఏకగ్రీవం అయినప్పటికీ, గిరిగామలో మాత్రం ఎన్నికల వేడి చెలరేగింది. ఈ గ్రామంలో ఆరుగురు సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడంతో పోటీ ఉత్కంఠ భరితంగా మారింది. గ్రామంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.

మిగిలిన తాంసి మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు పోటాపోటీ నెలకొననుంది.

గ్రామాల అభివృద్ధికి ఏకగ్రీవ నిర్ణయాలు మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.