రెండేళ్ల పాలన – చేసిన పనులు చెప్పుకోలేని రేవంత్ సర్కార్? వ్యూహాత్మక లోపాలే కాంగ్రెస్కు మైనస్!
మన భారత్ , రాజకీయ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విజయాలను ప్రదర్శించేందుకు భారీ స్థాయి సభలకు సిద్ధమవుతోంది. కానీ పాలనలో చేపట్టిన కీలక నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు ప్రజల్లో చర్చగా మారినా… ప్రచారంలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ వెనుకబడి పోతుందన్న విమర్శలు వ్యాపిస్తున్నాయి. చేసిన పనుల్ని సకాలంలో, సరైన రీతిలో ప్రజలకు తెలియజేయలేకపోవడం ప్రభుత్వానికి ప్రధాన మైనస్ పాయింట్గా మారింది.
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ – ఎందుకు చెప్పుకోలేకపోయారు?
రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రధాన కార్యక్రమాల్లో రైతుల రుణమాఫీ ఒకటి. దాదాపు ₹25,000 కోట్లను రెండు లక్షల పరిమితిలో అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వ చర్య రైతులకు ఊరట కలిగించింది.
అయినా…
- కొందరికి సాంకేతిక సమస్యలు,
- కొందరు అనర్హులందు ఉండడం,
- కొన్ని గ్రామాల్లో అమలు విధానం పై అసంతృప్తి,
ఇవే అంశాలను బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసి కాంగ్రెస్పై నెగెటివ్ నేరేటివ్ సృష్టించగా,
కాంగ్రెస్ మాత్రం తాము లాభపడిన లక్షల మంది రైతుల విజయకథలను ప్రజల్లో సరిగా చర్చనీయాంశం చేయలేకపోయింది.
ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్ పెంపు, గురుకులాల మెరుగుదల వంటి పథకాలకు కూడా ఇదే పరిస్థితి. పని చేసినా… ప్రచారం చేయలేకపోవడం కాంగ్రెస్కు మళ్లీ మళ్లీ ఎదురవుతున్న సమస్య.
విపక్షాల ఆరోపణలకు కఠిన కౌంటర్ లేకపోవడం
హిల్ట్ పాలసీ నుంచి ప్రభుత్వంపై వచ్చిన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణల వరకు—
విపక్షాలు కాంగ్రెస్ను అవినీతిపాలిత ప్రభుత్వమని చిత్రీకరించే ప్రయత్నంలో ఉన్నాయి.
సహజంగానే…
విపక్షాల పని ఆరోపణలు చేయడం.
కానీ అధికార పార్టీ పని —
“మేము నిజాయితీగా పనిచేశాం, ఆరోపణలు అసత్యం” అని ప్రజల ముందు స్పష్టమైన ఆధారాలతో చెప్పడం.
ఇక్కడే కాంగ్రెస్ వెనుకబడి పోతోంది.
- ప్రతి ఆరోపణకు బలమైన కౌంటర్ ఇవ్వకపోవడం,
- ప్రతిభావంతమైన మీడియా మేనేజ్మెంట్ లోపం,
- రాష్ట్ర నాయకత్వంలో ఏకాభిప్రాయం లేకపోవడం
వీటన్నిటి వల్ల విపక్షాలు వేసిన బురద కాంగ్రెస్పై పడుతుంది… కానీ దాన్ని తుడిచేందుకు కాంగ్రెస్కి వ్యూహాత్మక సిద్ధత లేదు అన్న భావన ఏర్పడుతోంది.
చేసిన పని — ప్రజలే మాట్లాడేలా చేయాలి
ప్రచారం అంటే కేవలం సోషల్ మీడియా పోస్టర్లు, పేపర్ ప్రకటనలు కాదు.
ప్రజల మధ్య తమకెంత మేలు జరిగిందో వారు గుర్తించుకునేలా, పంచుకునేలా వాతావరణం సృష్టించడం ముఖ్యం.
- గ్రామ స్థాయిలో చర్చలు,
- లబ్ధిదారుల అనుభవాలు,
- పథకాల ఫలితాలపై ప్రత్యక్ష ప్రచారం
అవి జరిగితేనే ప్రతిపక్షం చేసే అసత్య ప్రచారాన్ని స్వయంగా ప్రజలే కౌంటర్ చేస్తారు.
లేదంటే…
“చేసినా లేనట్టే… విపక్షాలు చెప్పిందే నిజం” అన్న భావన ప్రజల్లో బలపడుతుంది — ఇది రాజకీయపరంగా ప్రమాదకరమని విశ్లేషకులు చెబుతున్నారు.