FBలో ‘హాయ్’… చనువు పెంచి ₹14 కోట్లు దోచుకున్న సైబర్ మాయలేడీ!
మన భారత్ – క్రైమ్ & సైబర్ సెక్యూరిటీ డెస్క్
హైదరాబాద్: సోషల్ మీడియా మార్మోగే ప్రమాదాలకు మరో ఉదాహరణగా ఎర్రగడ్డకు చెందిన ఓ వైద్యుడు భారీ ఆర్థిక మోసానికి బలయ్యారు. ఫేస్బుక్లో ‘హాయ్’ అంటూ ప్రారంభమైన పరిచయం చివరికి ₹14 కోట్ల నష్టంగా మారింది. మాయమాటలు, నకిలీ ట్రేడింగ్ ప్లాట్ఫారమ్, భావోద్వేగాలను దోపిడీ చేసే స్కామ్ మేళవింపుగా జరిగిన ఈ సంఘటనను సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్రంగా తీసుకున్నారు.
ఎలా జరిగింది మోసం?
డాక్టర్ ఫేస్బుక్ అకౌంట్కు గత ఆగస్టు 27న ‘మోనిక’ పేరిట ఓ మహిళ మెసేజ్ పంపింది. రోజురోజుకు చాట్లు పెరిగి ఇద్దరి మధ్య చనువు పెరిగింది. వ్యక్తిగత ఫొటోలు కూడా పంచుకునేంతగా పరిచయం గాఢమైంది. ఈ సాన్నిహిత్యాన్ని ఆసరాగా తీసుకున్న మాయలేడి, ట్రేడ్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే డబ్బులు డబుల్ అవుతాయని తెలిపింది.
ఆమె చెప్పినట్టే నకిలీ ట్రేడింగ్ యాప్లో డాక్టర్ విడతల వారీగా ₹14 కోట్లు పెట్టుబడి పెట్టారు. కొద్ది రోజులకే అకౌంట్లో ₹34 కోట్లు ఉన్నట్లు స్క్రీన్పై కనిపించడంతో నమ్మకం పెరిగింది. అయితే amount withdraw చేయాలని ప్రయత్నించగానే, ఏ రూపాయీ రాలేదు. సందేహం వచ్చిన డాక్టర్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు.
సైబర్ నేరగాళ్ల గుంపు పని!
దర్యాప్తులో ‘మోనిక’ అనే మహిళ అసలు లేదని, ఆమె వెనుక ఓ గుంపు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ ఐడీలు, క్లోన్డ్ ట్రేడింగ్ వెబ్సైట్లు, వర్చువల్ నంబర్లతో మోసం చేసినట్టు తేలింది. కేసు నమోదు చేసి నిందితుల ట్రాకింగ్కు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి.
సైబర్ పోలీసులు ప్రజలకు సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు పంచుకోవద్దని, సులభంగా డబ్బు రెట్టింపు అవుతాయనే పెట్టుబడి స్కీమ్లను నమ్మకూడదని హెచ్చరిస్తున్నారు.