దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చిన GDP వృద్ధి — ప్రతి భారత పౌరుడికి ఉత్సాహవార్త: CM చంద్రబాబు
మన భారత్ – నేషనల్ డెస్క్, న్యూఢిల్లీ: 2025–26 ఆర్థిక సంవత్సర ద్వితీయ త్రైమాసికానికి దేశ GDP 8.2% పెరిగినట్టు వెల్లడికావడం దేశవ్యాప్తంగా ఆశాజ్యోతి రేపుతోంది. ఈ వృద్ధి దేశ పౌరులందరికీ ఉత్సాహాన్నిచ్చే వార్త అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ వేగవంతమైన పురోగతి భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిపిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ‘వికసిత్ భారత్’ లక్ష్యాల దిశగా ధైర్యంగా, స్థిరంగా ముందుకు సాగుతోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తయారీ, నిర్మాణం, ఆర్థిక సేవలు వంటి కీలక రంగాల్లో నమోదైన గణనీయ విస్తరణ ఈ వృద్ధికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. తాజా GDP గణాంకాలు పెట్టుబడిదారులకు నమ్మకాన్ని, పరిశ్రమలకు కొత్త ఊపును అందిస్తాయని అన్నారు.
ఆర్థిక రంగాల్లో నమోదవుతున్న ఈ ప్రగతి దేశ భవిష్యత్తును మరింత బలోపేతం చేస్తుందని, ఈ దిశగా రాష్ట్రాలు కూడా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.