manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 November 2025, 8:40 pm Editor : manabharath

కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత..

కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

మన భారత్ – స్టేట్ డెస్క్ కాన్పూర్: దేశ రాజకీయ రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీప్రకాశ్ జైస్వాల్ (81) ఇక లేరు. శుక్రవారం ఉదయం ఆయనకు అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ రావడంతో కాన్పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది.

శ్రీప్రకాశ్ జైస్వాల్ 2004 నుండి 2009 వరకు హోంశాఖ సహాయ మంత్రిగా, అనంతరం 2011 నుండి 2014 వరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజలకు చేరువై పనిచేసిన నాయకుడిగా పేరుపొందారు. కేంద్ర మంత్రిత్వానికి ముందు 2000–2002 మధ్య ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (UPCC) అధ్యక్షుడిగా సేవలు అందించారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన నేతగా ఆయనను కాంగ్రెస్ నాయకులు స్మరించుకున్నారు.

శ్రీప్రకాశ్ జైస్వాల్ మృతి పట్ల అనేక అగ్ర నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన సేవలను జ్ఞాపకం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల పట్ల సానుభూతి తెలిపారు.