manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 November 2025, 1:11 pm Editor : manabharath

ఆటో కార్మికుల హామీలు వెంటనే అమలు చేయాలి

ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి – తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్

మన భారత్, నాగర్‌కర్నూల్: ఆటో కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్లతో నాగర్‌ కర్నూల్ అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్‌టీఎఫ్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ధర్నా చేపట్టారు. ఆటో డ్రైవర్లకు జీవన భృతి రూ.12,000 చెల్లించాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, కార్మికులకు అనువైనచోట అడ్డాలు ఏర్పాటుచేయాలని ఈ నిరసనలో ప్రధానంగా కోరారు.

ఈ సందర్భంగా తెలంగాణ పబ్లిక్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొదిలి రామయ్య మాట్లాడుతూ…

“రవాణా రంగంలో ఆటో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ ఉచిత బస్సు పథకం వల్ల వారి జీవనం దెబ్బతింది. కిరాయిలు లేక, ఆదాయం లేక ఫైనాన్స్ చెల్లించలేక అనేక మంది ఆటోలు అమ్ముకుని రోడ్డుపైకి వచ్చారు. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరం” అని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించిన రామయ్య…

“ప్రతి ఆటో కార్మికునికి సంవత్సరానికి రూ.12,000 జీవన భృతి అని చెప్పి ఇప్పుడు మౌనంగా ఉంది. రవాణా కార్మికుల కోసం ప్రకటించిన టీయూ యాప్, రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం, ప్రైవేట్ యాప్‌లు అయిన రాపిడో–ఓలా–ఉబర్‌పై చర్యల గురించి ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా సీఎం గానీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గానీ స్పందించకపోవడం దురదృష్టకరం” అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆటో కార్మికులకు జీవనభృతి అందిస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

ఆటో కార్మికుల హక్కుల రక్షణ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, రోడ్డు మీదే జీవనం సాగించే ఈ వర్గం కోసం ప్రత్యేక చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. 2019 మోటార్ వాహనాల చట్టం రవాణా కార్మికులకు భారమైందని, దానిని రద్దు చేయాలని కూడా పేర్కొన్నారు.

కార్మికులకు కిరాయిలు లేక అడ్డాల్లోనే రోజంతా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొన్నదని, ఇదే సమయంలో రాపిడో వంటి యాప్‌లు మరింత ఇబ్బందులు తెస్తున్నాయని అన్నారు.

ధర్నాలో జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి, రుక్లుద్దీన్, మహమూద్, లింగం, ఆసన్, శ్రీను, మల్లేష్, కాసిం, చందు, శివ, రాముడు, పుల్లయ్య, సత్తిరాజు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.