గుండె పోటు అత్యవసరాల్లో ‘సీపీఆర్’ ప్రాణరక్షక చర్య – తాంసిలో అవగాహన సదస్సు
మన భారత్, తాంసి: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడడంలో సీపీఆర్ (CPR) అత్యంత కీలకమని తాంసి ఎస్సై జీవన్ రెడ్డి తెలిపారు. మంగళవారం తాంసి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ శ్రావ్య వాణీ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది.
గుండె పోటు వచ్చిన వ్యక్తిని తక్షణమే సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలకు ప్రమాదం తగ్గుతుందని వైద్య అధికారులు వివరించారు. శ్రావ్య వాణీ ప్రయోగాత్మకంగా సీపీఆర్ చేసే విధానాన్ని చూపిస్తూ… ఛాతీ నొక్కే పద్ధతి, శ్వాసనాళం తెరవడం, శ్వాసనివ్వడం వంటి అత్యవసర స్టెప్పులను పాల్గొనేవారికి వివరించారు.
రోడ్డు ప్రమాదాల సమయంలో సాధ్యమైనంత త్వరగా సీపీఆర్ చేయడం కూడా ఎంతో ఉపయోగకరమని ఎస్సై జీవన్ రెడ్డి పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించడం, హెల్మెట్–సీట్బెల్ట్ వినియోగం తప్పనిసరి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఏఎస్సై ఉత్తమ్, హెల్త్ సూపర్వైజర్ తులసిరామ్, హెల్త్ అసిస్టెంట్ నాగేశ్, పిహెచ్ఎమ్ సంపత్ కుమారి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.