మన సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ సమీపంలో..? ఎన్నికల సంఘం వేగవంతం చేసిన ఏర్పాట్లు
మన భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సిద్ధమైంది. వారం రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాయి. డిసెంబర్ 10 నుండి డిసెంబర్ 20 మధ్యగా మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇటీవలే ఎలక్షన్ కమిషన్ జిల్లా కలెక్టర్లతో సమావేశమై, ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఏ తప్పిదం చోటు చేసుకోకుండా, నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు జరగాలని స్పష్టం చేసినట్లు తెలిసింది.
ప్రజాపాలన వారోత్సవాల తర్వాతే ఎన్నికలు
సమీపంలో జరిగిన కేబినెట్ భేటీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరగనున్న ప్రజాపాలన వారోత్సవాలు పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకే డిసెంబర్ 10 తర్వాతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది.
హైకోర్టు ఆదేశాలు.. రిజర్వేషన్లపై వాయిదా
గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటికే ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయగా, రిజర్వేషన్లు 50% మించకూడదంటూ హైకోర్టు ఆర్డినెన్స్ను రద్దు చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి.
అయితే హైకోర్టు ఈ నెల 24లోగా ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించిన నేపథ్యంలో, ఎస్ఈసీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ సిద్ధం చేస్తుండటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
నిర్వాహక వ్యవస్థ సన్నద్ధం
జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమావేశాలు పూర్తయ్యాయి. బ్యాలట్ పేపర్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, సిబ్బంది నియామకంపై చర్యలు వేగవంతమయ్యాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.