టీవీ ఛానెళ్లకు కేంద్రం కఠిన హెచ్చరిక
సున్నితమైన కంటెంట్ ప్రసారంలో జాగ్రత్తలు తప్పనిసరి
మన భారత్, న్యూఢిల్లీ: దేశ భద్రత, సామాజిక శాంతి పరిరక్షణలో భాగంగా సున్నితమైన మరియు రెచ్చగొట్టే కంటెంట్ ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం టీవీ ఛానెళ్లకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల ఎర్రకోట పేలుడు ఘటనతో పాటు కొన్ని కీలక సంఘటనలకు సంబంధించిన వీడియోలు, వార్తా కంటెంట్ కొన్ని ఛానెళ్లలో ఆందోళన రేపే విధంగా ప్రసారమయ్యాయని కేంద్రం ఆక్షేపించింది.
సమాజంలో విభేదాలు రేకెత్తించేలా, హింసను ప్రేరేపించేలా, లేదా దేశ భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్న దృశ్యాలను ప్రసారం చేయడం చట్టవిరుద్ధమని స్పష్టంచేసింది. పౌరులలో భయం, అవిశ్వాసం పెంచే విధమైన కంటెంట్ను వెంటనే నిలిపేయాలని కూడా సూచించింది. సమాచారాన్ని బాధ్యతాయుతంగా, ధృవీకరించి మాత్రమే ప్రసారం చేయాలని ఛానెళ్లను కేంద్రం మరోసారి గుర్తు చేసింది.
న్యూస్ ప్రసారాల్లో సంయమనం పాటిస్తేనే ప్రజలకు నిజమైన సమాచారం చేరుతుందని, మీడియా విశ్వసనీయత కూడా కాపాడబడుతుందని కేంద్రం స్పష్టం చేసింది.