సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ₹5 లక్షల చొప్పున పరిహారం — మంత్రివర్గ నిర్ణయం
మన భారత్, హైదరాబాద్: సౌదీ ఆరేబియాలో మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన బస్సు ప్రమాదంలో పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మృతుల కుటుంబాలకు ₹5 లక్షల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటన పట్ల సంతాపం ప్రకటించిన మంత్రివర్గం, బాధితులకు పూర్తి సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది.
అదే సమావేశంలో, మంత్రి మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో, ఎంఐఎం ఎమ్మెల్యే మరియు మైనారిటీ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీ అరేబియాకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా తోడుగా ఉండేందుకు ఈ బృందం అక్కడి అధికారులతో సమన్వయం చేస్తుంది.
మృతుల కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని అనుసరించి మృతదేహాలను అక్కడే మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇందుకోసం ప్రతి కుటుంబం నుంచి ఇద్దరిని సౌదీ అరేబియాకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం ఆదేశించింది.
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని, బాధితుల కుటుంబాల పట్ల నిరంతర సహాయం అందిస్తామని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
#SaudiBusAccident #TelanganaCabinet #RevanthReddy #Compensation #Azaaruddin #AIMIM #ManaBharath.Com