manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 November 2025, 4:42 am Editor : manabharath

రిగ్గింగ్‌తోనే కాంగ్రెస్ గెలుపు: మాగంటి సునీత

రిగ్గింగ్‌తోనే కాంగ్రెస్ గెలుపు: మాగంటి సునీత మండిపాటు..జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై తీవ్ర ఆరోపణలు

హైదరాబాద్,మన భారత్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తిగా అప్రజాస్వామ్య వాతావరణంలో జరిగిందని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మండిపడ్డారు. ఉప ఎన్నికలో రౌడీయిజానికి కాంగ్రెస్ నేతలు పాల్పడ్డారని, ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. “ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఎన్నిక. రిగ్గింగ్ చేసి కాంగ్రెస్ గెలిచింది” అంటూ మాగంటి సునీత ఘాటుగానే స్పందించారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,658 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రతి రౌండ్‌లోను కాంగ్రెస్ ఆధిక్యాన్ని కొనసాగించగా, బీజేపీ డిపాజిట్‌ కూడా కోల్పోయింది. అధికారిక ఫలితాలు వెలువడిన వెంటనే మాగంటి సునీత మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నిర్వహణలో భారీ వైఫల్యం చోటుచేసుకుందని, ఈసీ పూర్తిగా పరిస్థితిని అదుపు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు.

“అసలు గెలుపు కాంగ్రెస్‌ది కాదు… నైతికంగా గెలిచింది నేనే” అని ఆమె స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే ఎన్నిక ఇది కాదని, రిగ్గింగ్ ఘటనలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

ఈ ఏడాది జూన్ 8న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి నవంబర్ 11న ఉప ఎన్నిక జరిగింది. నవంబర్ 14న కౌంటింగ్‌లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్‌లోనే పార్టీ గెలుపు సూచనలు కనిపించాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.

Maganti Sunitha, Jubilee Hills By-Election, Rigging Allegations, Congress Victory, Hyderabad Politics