ప్రతిపక్షంలోనూ గెలవని కాంగ్రెస్… కానీ మేము తిరిగి వస్తాం: KTR
మన భారత్ – హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ, BRS పార్టీకి గౌరవప్రదమైన ఓట్లు రావడం తమకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. “ఈ ఎన్నిక మాకు ఎనర్జీ ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వానికి నిజమైన ప్రత్యామ్నాయమేమన్నది ప్రజలు మరోసారి స్పష్టం చేశారు”అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ అప్పటి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఉపఎన్నికలు గెలవలేదని, కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిందని గుర్తుచేసిన ఆయన, “మేమూ అదే దారిలో ముందుకు సాగుతున్నాం. ప్రజలు ఇచ్చిన సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే మేము పునరాగమనం చేస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలకు అవసరమైన అంశాలపైనే BRS ప్రచారం నడిపిందని, ఇతర పార్టీల మాదిరిగా అసభ్య భాష లేదా వ్యక్తిగత దాడులలో పాల్గొనలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తన పార్టీ విధానాలు, ప్రజా సమస్యలపై తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లేటట్టు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.