రైతుల సమస్యలపై కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ.. సడలింపులు కీలకం
మన భారత్ , హైదరాబాద్: తెలంగాణ రైతులు వరుసగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం గమనించి వెంటనే జోక్యం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి లేఖ రాశారు. సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
తుఫాను–అకాల వర్షాలతో తీవ్ర నష్టం
‘మొంథా’ తుఫాను, అకాల వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల పంటలు భారీగా నష్టపోయాయని మంత్రి తుమ్మల తెలిపారు. ముఖ్యంగా సోయాబీన్ పంటలో గింజల రంగు మారడం, ముడతలు రావడం వల్ల ఎఫ్ఏక్యూ ప్రమాణాలు తగ్గాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు ఉపశమనం కల్పించేందుకు **సోయాబీన్ ఎఫ్ఏక్యూ ప్రమాణాల్లో సడలింపు ఇవ్వాలని** కేంద్రాన్ని అభ్యర్థించారు. NAFED, NCCF సంస్థలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
సోయాబీన్ సాగు–దిగుబడిపై వివరాలు
రాష్ట్రంలో 3.66 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగు జరిగిందని, ఎకరాకు 7.62 క్వింటాళ్ల సగటు దిగుబడి నమోదైందని మంత్రి వెల్లడించారు.
మొక్కజొన్న కొనుగోళ్లలో విస్తరణ అవసరం
ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 48,757 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసి 14,519 మంది రైతులకు లాభం చేకూర్చిందని తుమ్మల తెలిపారు. కనీస మద్దతు ధర (MSP Procurement) కింద 16.85 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు NAFED, NCCF సంస్థలకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
పత్తి రైతులకు రిలీఫ్ కావాలి..
పత్తి కొనుగోళ్లలో అమలు చేస్తున్న ఎకరాకు 7 క్వింటాళ్ల పరిమితి రైతులకు పెద్ద నష్టం కలిగిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఈ పరిమితిని రద్దు చేసి, పత్తి తేమ శాతంపై సడలింపులు కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో పత్తి ఎకరాకు 11.74 క్వింటాళ్ల సగటు దిగుబడి వచ్చే పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కొనసాగించాలని కేంద్రానికి తెలియజేశారు.
కేంద్రం తక్షణ చర్యలు చేపట్టాలి..
పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ రైతులు సంక్షోభంలో ఉన్నారని, వారి రక్షణ కోసం కేంద్రం వెంటనే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.