‘జూబ్లీహిల్స్’ ఉపఎన్నిక — సెన్సార్ పూర్తి, రిలీజ్కు కౌంట్డౌన్!
మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓ సినిమా షూటింగ్ను తలపించింది. అభ్యర్థుల ప్రచార శైలీ, నాయకుల ఎంట్రీలు, భారీ ర్యాలీలు, హామీల హడావుడి… అన్నీ కలిపి పూర్తిగా రియల్–పాలిటికల్ మూవీలా మారాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు మేజర్ రోల్స్ పోషించగా, ప్రముఖ నాయకులు అతిథి పాత్రల్లో కనిపించారు. చివరికి ‘సెన్సార్’ పోలింగ్ 11న పూర్తయింది. ఇప్పుడు రెడీగా ఉన్నది ‘రిలీజ్ డేట్’ నవంబర్ 14.
ఈ ఉపఎన్నికలో కథ అంతా ఓటరునే చుట్టూ తిరిగింది. ప్రచార వేడి శీతాకాలాన్ని మించిపోయేలా పెరిగింది. ప్రతి పార్టీ ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు డైలాగులు, హామీలు, భారీ ర్యాలీలతో తమతమ పాత్రలను గట్టిగా నడిపించారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో తప్పనిసరి అయిన ఈ ఎన్నికను మరోసారి గెలుచుకోవాలని సిట్టింగ్ పార్టీ, ఎలాగైనా సీటు సాధించాలని అధికార పార్టీ, అవకాశం కోసం ఎదురు చూసిన ఇతర పార్టీలు అన్ని అస్త్రశాస్త్రాలను వినియోగించాయి.
కానీ భారీగా పోలింగ్ వచ్చేలా చేసిన ప్రయత్నాలు సగం వరకే పని చేశాయి. ఊహించినంతగా ఓటర్లు బయటకు రాకపోవడం ‘స్క్రీన్ప్లేలో ట్విస్ట్’గా మారింది. ఈ ట్విస్ట్ ఎలా ముగుస్తుందో తెలిసేది రిలీజ్ డే రోజు.
సాంకేతిక విభాగం పనితీరు..ఎన్నికల సంఘమే డైరెక్టర్
ఉపఎన్నికలో సాంకేతికతను చూసుకున్నది ఎన్నికల కమిషనే. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, నియమ నిబంధనల అమలు, భద్రత — అన్నీ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్లా అద్భుతంగా నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి తమ పాత్రను సమర్థవంతంగా పోషించారు.
భారీ బడ్జెట్ — 80 కోట్ల నుంచి 100 కోట్ల వరకు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బడ్జెట్ సినిమా బడ్జెట్ను మరిపించింది. నామినేషన్ ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు, నాయకుల సందర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు— ఇవన్నీ కలిసి భారీ ఖర్చుకు దారితీశాయి. మొత్తం రూ.80 కోట్లు నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేశారన్న టాక్ ప్రచార వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
ఇప్పుడు ప్రేక్షకులు—అంటే ఓటర్లు—తమ నిర్ణయాన్ని ‘బ్యాలెట్ బాక్స్’లో సీల్ చేశారు. నవంబర్ 14న ఫలితాలు విడుదలైన తర్వాత… ఈ ‘రియల్ పాలిటికల్ మూవీ’ హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అన్నది తేలనుంది.