👶 తెలంగాణలో మరో నూతన పథకం… ‘బాల భరోసా’తో చిన్నారులకు ఆరోగ్య రక్షణ!
ఐదు సంవత్సరాల లోపు పిల్లల వైద్యసేవలకు సీఎం రేవంత్ సర్కారు పెద్ద నిర్ణయం
మన భారత్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రజా ఆరోగ్య రంగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం ‘బాల భరోసా’ అనే కొత్త పథకాన్ని అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైంది.
వివిధ రకాల అనారోగ్య సమస్యలు, వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంటోంది. ఈ పథకాన్ని ఆరోగ్యశ్రీతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వ్యాధుల చికిత్సకూ ప్రభుత్వం వెనుకాడదని అధికార వర్గాలు వెల్లడించాయి. ‘బాల భరోసా’ వర్తించని వ్యాధుల చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి నిధులు విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
రాష్ట్రంలోని ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల ఆరోగ్యంపై భయపడాల్సిన అవసరం లేకుండా, పేద కుటుంబాల పిల్లలకు సమగ్ర వైద్య సంరక్షణ అందించడమే ఈ పథక ఉద్దేశమని ప్రభుత్వం వెల్లడించింది. త్వరలో అధికారికంగా పథకాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.