manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 5:45 am Editor : manabharath

బాంబ్ బ్లాస్ట్.. నిందితుడి పోటో విడుదల

🚨ఎర్రకోట సమీపంలో కారు పేలుడు కలకలం.. నిందితుడు ఉమర్ మహ్మద్ ఫోటో విడుదల

న్యూఢిల్లీ, నవంబర్ 10 : రాజధాని ఢిల్లీ మరోసారి పేలుళ్లతో తల్లడిల్లింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. హుండాయ్ i20 కారులో సంభవించిన ఈ పేలుడులో 9 మంది దుర్మరణం పాలయ్యారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఎల్‌జెఎన్‌పీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు, బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలంలో తీవ్రంగా దర్యాప్తు చేపట్టాయి. ప్రాథమిక విచారణలో కారు లోపల అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్, ఇంధన నూనె వంటి పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు గుర్తించారు. ఇది ఆత్మాహుతి దాడిగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటన వెనుక ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహ్మద్ తొలి ఫోటోను అధికారులు విడుదల చేశారు. అయితే అతను పేలుడులో మరణించాడా లేదా పారిపోయాడా అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. విచారణలో భాగంగా ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పోలీసు బృందాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి.

సమాచారం ప్రకారం, ఫరీదాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్ నుండి ఇటీవలే సుమారు 360 కిలోల అనుమానిత అమ్మోనియం నైట్రేట్, ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్న కొన్ని గంటలకే ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో రాజధాని భద్రతా వ్యవస్థ స్తంభించింది.

ప్రధానమంత్రి, హోంమంత్రి స్థాయిలో అధికార యంత్రాంగం అత్యవసర సమీక్ష నిర్వహించగా, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.