కజ్జర్ల సబ్స్టేషన్లో మద్యం, పేకాట కేంద్రం..? ప్రజల్లో ఆందోళన
మన భారత్, తలమడుగు, నవంబర్ 7: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల సబ్స్టేషన్ మద్యం, పేకాట స్థావరంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజు రాత్రి వేళల్లో సబ్ స్టేషన్ గదిలోనే మద్యం సేవిస్తూ పేకాట ఆడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం , సబ్స్టేషన్లో ఆపరేటర్గా పనిచేస్తున్న ఓ రిటైర్డ్ లైన్మన్ కొడుకు విధి నిర్వహణ సమయంలోనే మద్యం సేవిస్తున్నాడని, దీంతో సబ్స్టేషన్ భద్రతపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన కీలక కేంద్రంలో ఇలా నిర్లక్ష్యం చోటుచేసుకోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
“ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇంత నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు?” అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రతిస్పందన లేకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రామ ప్రజలు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.