manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 November 2025, 4:49 am Editor : manabharath

రోడ్డు ప్రమాదం.. బస్సు-టిప్పర్ ఢీ లో 21 మంది దుర్మరణం

💥రంగారెడ్డి జిల్లాలో భయానక రోడ్డు ప్రమాదం.. బస్సు-టిప్పర్ ఢీ – 21 మంది దుర్మరణం, మరికొందరి స్థితి విషమం

 

మన భారత్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదం మిగిల్చింది. హైదరాబాద్ – బీజాపూర్ రహదారిపై తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్లతో సహా 21 మంది అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు.

ప్ర‌మాదం తీవ్రతను బట్టి చూస్తే బస్సు పూర్తిగా ధ్వంసమై, కంకర బస్సులోకి దూసుకెళ్లి కుడివైపున కూర్చున్న ప్రయాణికులపై పడింది. అందులో చిక్కుకున్న పలువురు ఊపిరాడక మృతి చెందారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.

స్థానికులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి, క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు అవశేషాలను కత్తిరించి మృతదేహాలను బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు యత్నిస్తున్నాయి. ఘటన స్థలాన్ని జిల్లా పోలీస్ అధికారులు పరిశీలిస్తున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, టిప్పర్ మితిమీరిన వేగంతో బస్సును ఢీకొట్టడం వల్ల ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

🚨 దుర్ఘటనతో మొత్తం జిల్లాలో విషాదఛాయలు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.