మొంథా తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం: సీఎం రేవంత్ రెడ్డి
ప్రజలకు ధైర్యం కల్పించిన సీఎం – ప్రతి కుటుంబానికి సహాయం అందిస్తామన్న హామీ
మన భారత్, వరంగల్:
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని 12 జిల్లాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. వరదలు, వర్షాల ప్రభావంతో పంటలు, రహదారులు, ఇళ్లు, పశుసంపదకు భారీ నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. ప్రజలు ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇస్తూ, ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
శుక్రవారం వరంగల్ జిల్లా కాపువాడలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పోతననగర్లో ముంపు ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, “తుఫాన్ వల్ల జరిగిన ఆస్తి, పంట నష్టం అంచనాలో ప్రజాప్రతినిధులను తప్పనిసరిగా పాల్గొననివ్వాలి. ఇన్చార్జ్ మంత్రులు, కలెక్టర్లు సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలి. ప్రాణనష్టం, పశుసంపద, రహదారులు, ఇళ్లు, ప్రభుత్వ భవనాలు — అన్నింటిపై పూర్తి వివరాలు సేకరించాలి” అని ఆదేశించారు.
తుఫాన్ నష్టాల నివేదికలను సమీకరించి కేంద్ర ప్రభుత్వానికి నిధుల కోసం పంపనున్నామని వెల్లడించారు. “తెలంగాణ ధనిక రాష్ట్రం అని కేంద్రం విస్మరించకూడదు. కేంద్ర నిధులు రావడానికి అధికారులు ఖచ్చితమైన వివరాలు ఇవ్వాలి. ప్రతి రూపాయి రాష్ట్రానికి రావాలని కృషి చేస్తాం” అని సీఎం తెలిపారు.
అదేవిధంగా, పారిశుద్ధ్య కార్యక్రమాలను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తున్నామని ప్రకటించారు. పొలాల్లో ఇసుక మేటలు తొలగించడానికి ఎకరాకు రూ.1 లక్ష చొప్పున సహాయం ఇవ్వనున్నట్లు తెలిపారు. పంట నష్టానికి ప్రతి ఎకరాకు రూ.10 వేల చొప్పున, ఇళ్లకు జరిగిన నష్టానికి రూ.15 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. “ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. వర్ష ప్రభావిత సమస్యలను అధిగమించేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తాం” అని అన్నారు.