మార్చి నాటికి మొబైల్ స్క్రీన్లో కాల్ చేసిన వ్యక్తి పేరు – టెలికాం సంస్థల పెద్ద నిర్ణయం
మన భారత్, న్యూఢిల్లీ: ఇకపై ట్రూకాలర్ వంటి యాప్ల అవసరం లేకుండానే మీ మొబైల్ ఫోన్లో కాల్ చేస్తున్న వ్యక్తి పేరు ప్రత్యక్షంగా కనిపించనుంది. దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు ఈ కొత్త సదుపాయాన్ని అందించేందుకు టెలికాం సంస్థలు సన్నాహాలు ప్రారంభించాయి. ప్రస్తుతం మొబైల్లో సేవ్ చేయని నంబర్ నుండి కాల్ వస్తే కేవలం నంబర్ మాత్రమే కనిపిస్తుంది. వ్యక్తి పేరు తెలుసుకోవాలంటే ట్రూకాలర్ లేదా ఇతర థర్డ్ పార్టీ యాప్లను వినియోగించాల్సి వస్తుంది. అయితే ఈ పరిస్థితి త్వరలో మారనుంది. టెలికాం శాఖ (DoT) మార్గదర్శకాలకు అనుగుణంగా “కాలర్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP)” పేరుతో కొత్త సదుపాయాన్ని అమలు చేయడానికి BSNL, Jio, Airtel, VI వంటి ప్రధాన టెలికాం సంస్థలు సాంకేతిక ఏర్పాట్లు చేపట్టాయి. ఈ సేవల ద్వారా ఫోన్ నంబర్ ఎవరి పేరుతో నమోదు చేయబడిందో ఆ వ్యక్తి పేరు కాల్ వచ్చినప్పుడు ఫోన్ స్క్రీన్పై ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అంటే ఆ నంబర్ ఎవరి ఆధార్ లేదా గుర్తింపు కార్డు ద్వారా తీసుకున్నదో, అదే పేరు యూజర్ స్క్రీన్పై ప్రదర్శితమవుతుంది. టెలికాం సంస్థల సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా ఈ సదుపాయం వచ్చే ఏడాది మార్చి నెల నాటికి పూర్తిగా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కొన్నిచోట్ల ప్రాయోగిక పరీక్షలు జరుగుతున్నాయి. నకిలీ కాల్స్, మోసపూరిత ప్రయత్నాలు, స్పామ్ కాల్స్ను తగ్గించడమే ఈ కొత్త ఫీచర్ లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ఈ సేవ ప్రారంభమయ్యాక మొబైల్ యూజర్లకు భద్రతా పరంగా మరింత నమ్మకాన్ని అందించగలదని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కాల్ చేస్తున్న వ్యక్తి పేరు తెలిసినంత మాత్రాన వినియోగదారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించగలరు, ఫిషింగ్, బ్యాంకింగ్ మోసాలు తగ్గే అవకాశం ఉందన్నారు.
మన భారత్ ప్రత్యేక ప్రతినిధి – న్యూఢిల్లీ
