మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల పరిధిలో అక్రమ దేశీ మద్యం రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు ఎక్సైజ్ శాఖ అధికారుల చేతిలో పట్టుబడ్డారు. బుధవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజేందర్ తెలిపిన వివరాల ప్రకారం – మండలంలోని బండల్ నాగపూర్ గ్రామానికి చెందిన అగ్గి మల్ల రవి, రాం టేకి ప్రశాంత్ అనే ఇద్దరు యువకులు మహారాష్ట్ర రాష్ట్రం నుంచి దేశీ దారును అక్రమంగా తాంసి ప్రాంతానికి తీసుకువస్తుండగా బోరజ్ వద్ద ఎక్సైజ్ సిబ్బంది వాహన తనిఖీల సమయంలో అడ్డుకున్నారు. సమీపంగా పరిశీలించగా, వారి వద్ద రూ.4 వేల విలువ గల 100 బాటిళ్ల (ప్రతి బాటిల్ 90 ఎంఎల్) దేశీ దారు స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం విక్రయం కోసం తాంసి గ్రామ పరిసరాలకు రవాణా చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇద్దరిపై ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, వారిని న్యాయస్థానానికి తరలించి రిమాండ్కు పంపినట్లు సీఐ విజేందర్ తెలిపారు. అక్రమ మద్య రవాణా, నిల్వ లేదా విక్రయం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక ప్రజలు కూడా ఇలాంటి అక్రమ మద్యం వ్యాపారాలను గుర్తిస్తే ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.