గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య
మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 28 : ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య మంగళవారం నేరడిగొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని రిజిస్టర్లను పరిశీలించి, ప్రతిరోజూ ఎంతమంది పాఠకులు వస్తున్నారో, పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే అంశాలను గ్రంథాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందిని కోరారు. నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే, విద్యార్థులకు గ్రంథాలయంలోనే ప్రశాంత వాతావరణంలో చదువుకునే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. తరువాత చైర్మన్ మల్లెపూల నర్సయ్యకు గ్రంథాలయ సిబ్బంది, స్థానిక నాయకులు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బొడ్డు గంగా రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆడే వసంత్ రావు, సీనియర్ నాయకులు ఏలేటి రాజశేఖర్ రెడ్డి, అనుపట్ల సంజీవ్, గట్టు అశోక్, రమేష్, యువ నాయకులు యండి సద్దాం, లైబ్రరీయన్ శ్రీకాంత్, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.