manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 3:33 am Editor : manabharath

ప్రకృతి ఒడిలో పచ్చని పూలదండలా మెరిసే సోయగం

జిల్లా కలెక్టర్ రాజర్షి షా కృషి.. వాగు అందాలు కమనీయం

 మన భారత్, ఆదిలాబాద్ : తాంసి గ్రామ పరిసరాల్లో ప్రవహించే మత్తడి వాగు ప్రకృతి సోయగాలతో కన్ను తిప్పుకోనీయకుండా మురిపిస్తోంది. వాగు ఒడ్డున పచ్చని చెట్లు, నీలి ఆకాశం ప్రతిబింబమై నీటిపై అలరారుతూ అపూర్వ దృశ్యాన్ని సృష్టిస్తున్నాయి. ఇటీవలి వర్షాలతో వాగు నీటిమట్టం పెరగడంతో పరిసరాలు మరింత పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ వాగు తీరానకు వచ్చే గ్రామస్థులు, పర్యాటకులు ఆ అందాలను ఆస్వాదిస్తూ సేద తీరుతున్నారు. నిశ్శబ్ద వాతావరణం, పక్షుల కిలకిలరాగాలు కలగలసి ఆ ప్రదేశాన్ని సహజమైన నేచర్ స్పాట్గా మార్చేశాయి.మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ మాట్లాడుతూ.. “మత్తడి వాగు ఎప్పుడూ మా గ్రామానికి ప్రాణాధారం. పంటల సాగు, తాగునీటి అవసరాలు మాత్రమే కాదు, ఇప్పుడు ప్రకృతి అందాలతో పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది” అని తెలిపారు.

జిల్లా కలెక్టర్ రాజర్షి షా సహాకారంతో పూడికతీత పనులు చేపట్టడంతో మళ్లీ మత్తడి వాగు పూర్వ వైభవం సంతరించుకుంది. మండుటెండలకు నీరు లేక తల్లడిల్లిన మత్తడి వాగు సమస్యను భూ భారతి సమయంలో జిల్లా కలెక్టర్ దృష్టికి మాజీ సర్పంచ్ గ్రామస్తులతో కలిసి తీసుకువెళ్లడంతో సమస్య తీరింది. జిల్లా కలెక్టర్ సహకారంతో రూ.3 లక్షల 50 వేల తో పూడికతీత పనులు చేపట్టారు. ప్రకృతి సోయగాలను కాపాడుతూ, పర్యావరణ పరిరక్షణకు గ్రామస్థులు కృషి చేయాలని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు. తాంసి మత్తడి వాగు నిజంగా ప్రకృతి ఒడిలో సొగసైన ఆభరణంలా మెరుస్తోంది.