పెద్ద శేష వాహనంపై మలయప్పస్వామి దర్శనం
మన భారత్, తిరుమల: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి స్వామి, అమ్మవార్లు తిరుమాడ వీధుల్లో దర్శనమివ్వగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు.ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో కలిసి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని సాక్షాత్కరింపజేస్తున్నాడు. అందుకే స్వామివారు బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఇచ్చాడు.ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, వీజీవో సురేంద్ర, పేష్కార్ శ్రీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.