తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్
– వర్షాలతో దెబ్బతిన్న పంటలు
-ఆర్థికంగా నలిగిపోతున్న రైతులు
మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 27:
ఇటీవలి వర్షాలతో పత్తి రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, భీంపూర్, తలమడుగు మండలాలతో పాటు ఇంద్రవెల్లి మండలంలోని గౌరాపూర్ సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పత్తి పంటలు వర్షానికి నష్టపోయి రైతులు ఆందోళనలో మునిగిపోయారు. పంటలు కుళ్లిపోవడం, పూత రాలిపోవడం, కాయలు తెరుచుకోకపోవడం వంటి పరిస్థితులు రైతుల కళ్లముందే కనిపిస్తున్నాయని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న ఒక ప్రకటనలో తెలిపారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చేనులలో నీరు నిలిచిపోయి పత్తి పంటలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. దసరా ముందు పంట కోతకు సిద్ధమవుతుండగా ఆకులు పచ్చగా మారి పూత రాలిపోతూ దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందన్నారు. బొర్రన్న మాట్లాడుతూ, “రైతులు ఇప్పటికే నాలుగు నుంచి ఐదు సార్లు పురుగుమందులు పిచికారీ చేశారు. యూరియా కొరతతో ఎరువులు దొరకడం లేదు. ప్రస్తుతం ఒక్క ఎకరాకు ₹20,000 నుంచి ₹25,000 వరకు పెట్టుబడి పెట్టినా, దిగుబడి నాలుగు లేదా ఐదు క్వింటాలకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది,” అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని నల్లరేగడి భూముల కారణంగా మొదటి విడుత పత్తికి తేమ శాతం అధికంగా ఉండటం సహజమని, అయితే సీసీఐ అధికారులు తేమ పేరిట రైతుల పత్తిని తిరస్కరించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. “రైతుల పత్తిని తేమ శాతం నిబంధనలు పక్కన పెట్టి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి” అని డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కపాస్–కిసాన్ యాప్ పట్ల రైతులకు అవగాహన లేకపోవడం సమస్యగా మారిందని ఆయన తెలిపారు. మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోవడం, వయస్సు పైబడిన రైతులకు స్మార్ట్ఫోన్లు అందుబాటులో లేకపోవడం వల్ల యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేయడం కష్టంగా మారిందన్నారు. “వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించి రైతులకు సాయం చేయాలి” అని బొర్రన్న కోరారు. స్లాట్ బుకింగ్ తర్వాత కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఉండటంతో రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో రైతులు దేవరావు, సంజీవ్, సంతోష్, భీంరావు, సుంగేష్, సాయినరావు, రాజు తదితరులు పాల్గొన్నారు.