ప్రభుత్వ భూమిలో నుంచి అక్రమంగా మొరం తరలింపు
మన భారత్, సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లాలో మొరం మాఫియా మరోసారి రెచ్చిపోతోంది. అందోల్ మండలం సంగుపేట శివారులోని ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా మొరం తవ్వి ప్రైవేట్ వెంచర్కు తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధికారులు అందుబాటులో ఉండరని అంచనా వేసి, కొందరు అక్రమార్కులు నిర్భయంగా మొరం తరలింపు కార్యక్రమాన్ని కొనసాగించారు. స్థానికుల సమాచారం మేరకు, మొరం తరలింపు జరుగుతోందని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ, వారంతా “ఆదివారం” అని కారణం చూపుతూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితిని వినియోగించుకున్న మాఫియా సభ్యులు నిర్భయంగా ప్రభుత్వ భూమిని తవ్వి ప్రైవేట్ వెంచర్కు మొరం పంపించారు. సహజ సంపదలను రక్షించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్థానికులు మాట్లాడుతూ, “రెవెన్యూ అధికారులు చూసినట్లు చూడకపోవడం వల్లే మాఫియా బలపడుతోంది. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలకు వాడుకోవడం తీవ్రంగా ఖండనీయమైందని” అన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దర్యాప్తు చేయాలని, మొరం అక్రమంగా తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.