జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రౌడీషీటర్కి కాంగ్రెస్ టికెట్..
-కేసీఆర్ ఎద్దేవా
మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ రౌడీ షీటర్కు టికెట్ ఇచ్చిందని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి హయాంలో తెలంగాణ గుల్ల అయిందని ఆక్షేపించారు. కేసీఆర్తో ఇవాళ(గురువారం) ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ కీలక నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై పార్టీ శ్రేణులకి గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు. రెండు గంటలకి పైగా ఈ సమావేశం కొనసాగింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై మార్గనిర్దేశం చేశారు కేసీఆర్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డివిజన్ల వారీగా ఇప్పటివరకు జరిగిన ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. మాగంటి గోపీనాథ్ చనిపోయారని.. ఈ క్రమంలో ఉప ఎన్నిక అనివార్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధను దిగమింగుకుని ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కోవాలని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, పార్టీ కేడర్కి సూచించారు. రేవంత్రెడ్డి ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకుని ముందుకెళ్లాలని నేతలకు సూచించారు. రేవంత్రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల బాకీ కార్డులను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పంచాలని ఆజ్ఞాపించారు. రేవంత్రెడ్డి సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఆగమైందని విమర్శించారు. ఆగమవుతున్న తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో పేదలను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల్లో విస్తృతంగా కాంగ్రెస్ వైఫల్యాలపై చర్చ జరగాలని ఆదేశించారు కేసీఆర్.
జూబ్లీహిల్స్ బైపోల్స్లో బీఆర్ఎస్ విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో మెజారిటీపై ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ సూచించారు. హైదరాబాద్లో శాంతిభద్రతలను కాపాడుకోవడానికి జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాయమయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ దుష్టపాలనపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ నేతలకి సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ప్రభావం.. జీహెచ్ఎంసీ ఎన్నికలపైనా కూడా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు తమ వైపే ఉంటారని కేసీఆర్ జోస్యం చెప్పారు..