manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 October 2025, 11:03 am Editor : manabharath

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎం3 ఈవీఎం లతో ఓటింగ్

  • జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎం3 ఈవీఎంలతో ఓటింగ్ – 384 మంది అభ్యర్థుల పేర్లు నమోదు సాధ్యం
    నవంబర్ 11న పోలింగ్‌ – పేపర్ బ్యాలెట్‌లకు బదులుగా అధునాతన యంత్రాల వినియోగం

మన భారత్, హైదరాబాద్:
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఈసారి అత్యాధునిక ఎం3 వెర్షన్‌ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్స్‌ (EVMs)ను వినియోగించనున్నారు. నవంబర్‌ 11న జరిగే ఈ ఎన్నికల్లో ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నా పేపర్‌ బ్యాలెట్‌లను ఉపయోగించబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎం3 వెర్షన్‌ మెషీన్లతో ఓటింగ్‌ జరగనుందని అధికారులు తెలిపారు.

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉపఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, వాటిలో 135 సెట్లను ఆమోదించి, 186 సెట్లను తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. బీఆర్ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ నామినేషన్లలో వచ్చిన సాంకేతిక లోపాలపై అధికారులు వివరణలు కోరారు. అనంతరం ఇద్దరి నామినేషన్లను ఆమోదించారు.

ఎం3 వెర్షన్‌ ప్రత్యేకతలు
ఎన్నికల సంఘం రూపొందించిన ఎం3 ఈవీఎంలు మూడవ తరం యంత్రాలు. వీటిలో ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయిల్‌ (VVPAT) వ్యవస్థ కూడా ఉంటుంది. ఒక కంట్రోల్‌ యూనిట్‌కు గరిష్ఠంగా 24 బ్యాలటింగ్‌ యూనిట్లు కలపవచ్చు. ప్రతి బ్యాలటింగ్‌ యూనిట్‌లో 16 మంది అభ్యర్థుల పేర్లు, నోటా చిహ్నంతో సహా ప్రదర్శించవచ్చు. ఈ విధంగా ఒక నియోజకవర్గంలో గరిష్ఠంగా 384 మంది అభ్యర్థుల వివరాలను నమోదు చేయడం సాధ్యమవుతుంది.

ఎం2 మోడల్‌ మెషీన్లతో పోలిస్తే ఎం3 యంత్రాలు మరింత వేగవంతంగా, భద్రతా పరంగా మెరుగ్గా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈవీఎంలలోని డేటాను ఏ విధంగానూ హ్యాక్‌ చేయలేమని, సాంకేతిక భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టంగా ఉన్నాయని స్పష్టం చేశారు.

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు.