manabharath.com
Newspaper Banner
Date of Publish : 22 October 2025, 11:19 pm Editor : manabharath

అంతర్జాతీయ వేదికపై కేటీఆర్ ప్రతిభకు గౌరవం

అంతర్జాతీయ వేదికపై కేటీఆర్ ప్రతిభకు గౌరవం
శ్రీలంకలో జరగనున్న ‘గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ 2025’లో కీలకోపన్యాసానికి ఆహ్వానం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ వేదికపై మరో గౌరవం దక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావుకు శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగే ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ 2025’లో కీలకోపన్యాసం చేసేందుకు ఆహ్వానం లభించింది.

వచ్చే నెల 10 నుండి 12 వరకు కొలంబోలోని ‘ది కింగ్స్బరీ హోటల్’లో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక, సాంకేతిక నిపుణులు, విధాన నిర్ణేతలు పాల్గొననున్నారు. ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి రంగాలలో సాధించిన వేగవంతమైన పురోగతిని గుర్తించిన శ్రీలంక సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కేటీఆర్‌ను ఈ సదస్సులో ప్రధాన వక్తగా ఆహ్వానించింది. హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ మ్యాప్‌పై నిలిపిన విధానాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించిన తీరు, పరిశ్రమలకు అందించిన మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై ఆయన ప్రసంగించనున్నారు.

ఈ ఆహ్వానం తెలంగాణ అభివృద్ధి మోడల్‌కు అంతర్జాతీయ గుర్తింపుగా భావిస్తున్నారు. రాష్ట్రానికి మరోసారి గ్లోబల్ వేదికపై పేరు ప్రఖ్యాతులు తెచ్చే అవకాశమిదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.