manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 11:20 pm Editor : manabharath

ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల నిరసన..

పూనాగూడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల నిరసన…..

భోజనం, వసతులపై విద్యార్థుల ఆందోళన.. హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్లేందుకు యత్నం

తలమడుగు:మన భారత్ , సెప్టెంబర్ 3, మండలంలోని పూనాగూడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనకు దిగారు. పాఠశాల హాస్టల్‌లో సరిగ్గా భోజనం అందించడం లేదని, కనీస వసతులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని విద్యార్థులు ఆరోపించారు. దీంతో కొంతమంది విద్యార్థులు హాస్టల్‌ను వీడి ఇళ్లకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో విషయం అధికారుల దృష్టికి వెళ్లింది.

సమాచారం అందుకున్న ఐటీడీఏ ఏపీవో భాష్కర్, ఏజెన్సీ డీఈవో చందన, ఏటీడబ్ల్యూఓ అనిల్, తహశీల్దార్ రాజమోహన్, ఎస్‌ఐ రాధిక తదితర అధికారులు వెంటనే పూనాగూడ ఆశ్రమ పాఠశాల హాస్టల్‌కు చేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు హాస్టల్‌లో భోజనం నాణ్యత, వసతుల కొరత తదితర అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. విద్యార్థుల నుంచి సమస్యలను వివరంగా తెలుసుకున్న అధికారులు, సంబంధిత అంశాలపై పరిశీలన చేపట్టారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. హాస్టల్‌లో భోజనం, వసతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారుల హామీతో విద్యార్థులు తమ ఆందోళనను విరమించి హాస్టల్‌కు తిరిగి వెళ్లేందుకు అంగీకరించినట్లు సమాచారం.

విద్యార్థుల సమస్యలను అధికారులు స్వయంగా తెలుసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, తగిన వసతులు అందేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.