manabharath.com
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 2:25 pm Editor : manabharath

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ పోరుబాట..

బోథ్‌లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా.. 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన

హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్.. బాకీ కార్డుతో ఎమ్మెల్యే సెల్ఫీ

బోథ్: మన భారత్, సెప్టెంబర్ ,2,
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు బోథ్‌లో ఉధృతంగా కొనసాగాయి. ఏడు రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా బోథ్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అంబేడ్కర్ చౌరస్తా కిక్కిరిసిపోయింది.

హామీల అమలుపై ప్రశ్నలు.?

ధర్నాలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు “బాకీ కార్డులు” ప్రదర్శించారు. ప్రజలకు అందాల్సిన పథకాలు, హామీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయనే అంశాన్ని నిరసనలో ప్రధానంగా ప్రస్తావించారు.

420 అడుగుల ఫ్లెక్సీతో వినూత్న నిరసన

నిరసన కార్యక్రమంలో భాగంగా 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ “420 హామీల బాకీ కార్డు”తో సెల్ఫీ దిగుతూ ప్రభుత్వ హామీల అమలుపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

కార్యక్రమం సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో బోథ్ అంబేడ్కర్ చౌరస్తా దద్దరిల్లింది.

తెలంగాణ దేశానికే అక్షయ పాత్ర”

తెలంగాణ రాష్ట్రం గతంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పలు అంశాలను ప్రస్తావించారు. “తెలంగాణలో లంకె బిందెలు లేకపోవచ్చు.. కానీ తెలంగాణ దేశానికే అక్షయ పాత్ర” అంటూ రాష్ట్ర ఆర్థిక, వనరుల సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ.. తమ పాలనపై ప్రశ్నించే వారు బోథ్ నియోజకవర్గానికి వచ్చి 100 పడకల ఆసుపత్రిని పరిశీలించాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన పనులను ప్రజలు గమనించారని పేర్కొన్నారు.

బోథ్ రెవెన్యూ డివిజన్ కోసం పోరాటం

బోథ్ నియోజకవర్గ ప్రజల చిరకాల డిమాండ్లలో ఒకటైన బోథ్ రెవెన్యూ డివిజన్ అంశంపై కూడా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పందించారు. బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్ కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అవసరమైతే ప్రజలతో కలిసి మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని తెలిపారు.

ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుంది

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలకు వాటిని గుర్తు చేయడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడమే బీఆర్ఎస్ చేపడుతున్న నిరసన కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

“ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారు. హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుంది” అని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.