జాతీయ రహదారి నిర్మాణ పనుల వద్ద చోరీకి గురైన 25 కేవీఏ జనరేటర్ స్వాధీనం
ముగ్గురు నిందితుల అరెస్ట్.. మరో నిందితుడి కోసం గాలింపు
సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన జైనథ్ సర్కిల్ పోలీసులు
ఆదిలాబాద్, మన భారత్,సెప్టెంబర్ 1: జాతీయ రహదారి నిర్మాణ పనుల వద్ద ఉంచిన 25 కేవీఏ జనరేటర్ చోరీ కేసును జైనథ్ సర్కిల్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో ఛేదించారు. కేసులో నలుగురిపై బేల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. చోరీకి గురైన జనరేటర్తో పాటు మహేంద్ర మాక్స్ పికప్ గూడ్స్ వాహనం, నగదు, సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన కొందరు వ్యక్తులు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనానికి పాల్పడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బేలా-కొబ్బయి రహదారిపై దహేగాం ఎక్స్రోడ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఏర్పాటు చేసిన 25 కేవీఏ జనరేటర్ను గుర్తించారు.
వాచ్మెన్లు నిద్రిస్తున్న సమయంలో చోరీ
జూలై 31, 2026న రాత్రి సమయంలో ముగ్గురు నిందితులు మహేంద్ర మాక్స్ పికప్ వాహనంలో నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వాచ్మెన్లు నిద్రిస్తున్న సమయంలో జనరేటర్ను వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. అనంతరం జనరేటర్కు సంబంధించిన టైర్లు, పైభాగంలోని కవరింగ్ను తొలగించి వేరే ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.
చోరీ చేసిన జనరేటర్ను తక్కువ ధరకు విక్రయించేందుకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా కొండలవాడి గ్రామానికి చెందిన దేవ్కతే పవన్ను సంప్రదించారు. జనరేటర్ను రూ.90 వేలకే విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుని, ముందస్తుగా రూ.2,000 తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
మిగిలిన మొత్తాన్ని జనరేటర్ను కొండలవాడి గ్రామానికి తరలించిన అనంతరం చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
వాహన తనిఖీతో వెలుగులోకి..
జనరేటర్ను మహేంద్ర మాక్స్ పికప్ వాహనంలో తరలిస్తున్న సమయంలో పోలీసులు అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేశారు. విచారణ చేపట్టగా నిందితులు జనరేటర్ చోరీ చేసిన విషయాన్ని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో వారి నుంచి 25 కేవీఏ జనరేటర్, మహేంద్ర మాక్స్ పికప్ గూడ్స్ వాహనం (MH34BZ8140), రూ.2,000 నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
సాంకేతిక ఆధారాలతో ఛేదింపు
కేసు దర్యాప్తులో సాంకేతిక ఆధారాలను ఉపయోగించడంతో పాటు వివిధ విభాగాల పోలీసుల సమన్వయంతో నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన జైనథ్ సర్కిల్ పోలీసులను డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి అభినందించారు.
నేరాలకు పాల్పడే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం నుంచి తప్పించుకోలేరని డీఎస్పీ హెచ్చరించారు. నేరాలకు పాల్పడిన వ్యక్తులను సాంకేతిక ఆధారాలతో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నిందితుల వివరాలు
A1. విశాల్ రాథోడ్: చంద్రకాంత్ కుమారుడు, 26 సంవత్సరాలు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా జివితి తాలూకా లాల్డోహ్ గ్రామానికి చెందిన వ్యక్తి. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అరెస్ట్ చేశారు.
A2. రాథోడ్ రాహుల్: విశాల్ రాథోడ్ సోదరుడు. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. అరెస్ట్ చేశారు.
A3. రాథోడ్ పరమేశ్వర్: చంద్రపూర్ జిల్లా జివితి తాలూకా లాల్డోహ్ గ్రామానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు కొనసాగుతోంది.
A4. దేవ్కతే పవన్: రాజేశ్వర్ కుమారుడు, 26 సంవత్సరాలు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా కొండలవాడి గ్రామానికి చెందిన వ్యక్తి. డీజే ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఇతడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో నిందితులపై బేల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కేసు ఛేదనలో జైనథ్ సీఐ జి. శ్రావణ్, బేల ఎస్సై మధుకృష్ణతో పాటు పోలీసు సిబ్బంది కీలకంగా వ్యవహరించారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
