manabharath.com
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 2:26 am Editor : manabharath

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్

తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి వరకు ప్రస్తుతం ఒకే బస్సు నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, అత్యవసర సమయాల్లో బస్సు సౌకర్యం సరిపోక ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.

తలమడుగు మండలంలోని పలు గ్రామాల ప్రజలకు ఆదిలాబాద్ పట్టణంతో రాకపోకలకు బస్సు సౌకర్యమే ప్రధాన ఆధారంగా ఉంది. అయితే తలమడుగు నుంచి కోసాయి వరకు ఒకే బస్సు అందుబాటులో ఉండటంతో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రవాణా సౌకర్యం లేకుండా పోయిందని స్థానికులు తెలిపారు. ఒకే బస్సుపై అధిక సంఖ్యలో ప్రయాణికులు ఆధారపడాల్సి రావడంతో బస్సు వచ్చే సమయాల్లో రద్దీ నెలకొంటోందని చెప్పారు.

పండుగలు, అత్యవసర సమయాల్లో మరింత ఇబ్బందులు

పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీ సాధారణ రోజుల కంటే ఎక్కువగా ఉంటుందని, అలాంటి సందర్భాల్లో ఒకే బస్సు ఉండటం వల్ల ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు. అత్యవసర పనుల కోసం ఆదిలాబాద్ వెళ్లాల్సిన వారికి కూడా సరైన సమయంలో రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

ఉద్యోగులకు నైట్ బస్సు సౌకర్యం కరవు

ఆదిలాబాద్ పట్టణంలో ప్రతిరోజూ విధులకు వెళ్లి తిరిగి తలమడుగు, కోసాయి ప్రాంతాలకు వచ్చే ఉద్యోగులు కూడా రాత్రి వేళ బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రయాణికులు తెలిపారు. నైట్ బస్సు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని, దీంతో అదనపు ఖర్చు భరించాల్సి వస్తోందని చెప్పారు.

రెండు బస్సులతో పాటు నైట్ బస్సు ఏర్పాటు చేయాలి

ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తలమడుగు నుంచి కోసాయి వరకు కనీసం రెండు బస్సులను రోజువారీగా నడపడంతో పాటు, రాత్రి వేళ నైట్ బస్సు సర్వీసును కూడా ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రజా రవాణా మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, వృద్ధులు, అత్యవసర ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని స్థానికులు పేర్కొన్నారు. ప్రయాణికుల అవసరాలను పరిశీలించి తలమడుగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు, నైట్ సర్వీసును వెంటనే ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.