manabharath.com
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 2:17 am Editor : manabharath

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లాలో నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమలు

అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులకు నో

సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు నిబంధనలు అమలు.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

ఆదిలాబాద్, ఆగస్టు 31: జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.

జిల్లాలో ప్రశాంత వాతావరణానికి ఎలాంటి విఘాతం కలగకుండా, అసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటనలను నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. 30 పోలీస్ యాక్ట్–1861 అమల్లో ఉన్నందున డీఎస్పీ లేదా అంతకంటే పైస్థాయి పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ప్రజా సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడే కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.

ముందస్తు అనుమతి తప్పనిసరి

ఎలాంటి ప్రజా కార్యక్రమం, సమావేశం, ర్యాలీ నిర్వహించాలన్నా ముందుగా పోలీసు శాఖకు దరఖాస్తు చేసుకుని సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందాలని ఎస్పీ సూచించారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం లేదా వాటికి సన్నాహాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.

ఆయుధాలపై ఆంక్షలు

నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, దుడ్డుకర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు లేదా నేరాలకు ప్రేరేపించే ఇతర ప్రమాదకర వస్తువులను కలిగి ఉండటం, ప్రదర్శించడం పూర్తిగా నిషేధమని పోలీసులు తెలిపారు. ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యనూ అనుమతించబోమని స్పష్టం చేశారు.

గణపతి నవరాత్రి ఉత్సవాలకు సహకరించాలి

త్వరలో జరగనున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, నిర్వాహకులు పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. ఉత్సవాల సందర్భంగా ప్రజా జీవనానికి, ట్రాఫిక్‌కు, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా భారీ జనసమూహాలు ఏర్పాటు చేయరాదని సూచించారు.

డీజేలు, అధిక శబ్ద పరికరాలపై నిషేధం

అనుమతులు లేకుండా అధిక శబ్దం వచ్చే స్పీకర్లు, డీజేలు, ప్రచార రథాలు, మైకులు, ఇతర శబ్ద పరికరాలను వినియోగించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా శబ్ద కాలుష్యానికి కారణమయ్యే కార్యక్రమాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు

30 పోలీస్ యాక్ట్ కింద జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, అనుమతి అవసరమైన కార్యక్రమాలకు ముందుగానే పోలీసు శాఖను సంప్రదించి అనుమతులు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలో శాంతిభద్రతలు, ప్రజల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ కోరారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.