manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 5:50 am Editor : manabharath

మోసం చేసిన నిందితుడి అరెస్టు..

ఆటో డ్రైవర్‌ను మాటల్లో పెట్టి ఫోన్‌పే ద్వారా రూ.17 వేలు కాజేత

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఆటో డ్రైవర్‌ను మాటల్లో పెట్టి అతడి మొబైల్ ఫోన్‌ను తీసుకుని, ఫోన్‌పే ద్వారా రూ.17 వేల నగదును తన ఖాతాకు బదిలీ చేసుకున్న కేసులో నిందితుడిని టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.10 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు.

డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కలగూడకు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ హాది ఈ నెల 21న ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో నడుపుతున్నాడు. ఆ సమయంలో ఓ మహిళ, ఆమె కుమారుడు ఖండాల గ్రామానికి వెళ్లేందుకు ఆటోను అద్దెకు తీసుకున్నారు. మహిళను ఖండాల వద్ద దించిన అనంతరం ఆమెతో వచ్చిన వ్యక్తి మరో ప్రాంతానికి వెళ్లాలని కోరాడు. ఇందుకు ఆటో డ్రైవర్ రూ.2 వేల ఛార్జీగా చెప్పగా, అతను అంగీకరించాడు.

ఆటో ఆదిలాబాద్ క్రాస్‌రోడ్స్ వద్దకు చేరుకున్న సమయంలో తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని నిందితుడు ఆటో డ్రైవర్‌కు చెప్పాడు. అనంతరం అతడి మొబైల్ ఫోన్‌ను తీసుకుని ఫోన్ చేస్తున్నట్లు నటించాడు. ఈ క్రమంలో ఆటో డ్రైవర్‌కు తెలియకుండా అతడి ఫోన్‌లో ఉన్న ఫోన్‌పే యాప్ ద్వారా రూ.17,000లను తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు,

మరుసటి రోజు తన ఫోన్‌పే లావాదేవీలను పరిశీలించిన ఆటో డ్రైవర్ ఖాతా నుంచి రూ.17 వేలు బదిలీ అయినట్లు గుర్తించాడు. దీంతో వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా టూ టౌన్ పోలీసులు క్రైమ్ నంబర్ 576/2026, బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 318(4), 303(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల దర్యాప్తులో నిందితుడిని రాథోడ్ యువరాజ్ (26), తండ్రి దత్త, చిచ్‌ధరి ఖానాపూర్ గ్రామం, ఆదిలాబాద్ రూరల్ మండలం గా గుర్తించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి రూ.10 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో కూడా 8 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రజలు అపరిచితులకు తమ మొబైల్ ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్‌లో ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపు యాప్స్ ఉన్న సందర్భాల్లో ఇతరులకు ఫోన్ అప్పగించేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఏదైనా అనుమానాస్పద లావాదేవీ గుర్తించిన వెంటనే సంబంధిత సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు, ఎస్ఐలు అఖిల్, ప్రణయ్, పోలీసు సిబ్బంది ను ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి అభినందించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి