manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 9:03 pm Editor : manabharath

విద్యుత్‌ అదాలత్‌తో సమస్యలకు పరిష్కారం

తలమడుగులో ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌.. పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచన

తలమడుగు, ఆగస్టు 11, మన భారత్: విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ల ద్వారా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్‌ వినియోగదారుల ఫోరమ్‌ చైర్‌పర్సన్‌ చావాన్‌ జయవంత్‌రావు, మెంబర్‌ ఫైనాన్స్‌ శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం తలమడుగు మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో తలమడుగు, తాంసీ, భీంపూర్‌ మండలాలకు సంబంధించిన ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యుత్‌ వినియోగదారుల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. అధిక విద్యుత్‌ బిల్లులు, విద్యుత్‌ లైన్ల సమస్యలు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు, విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన ఇతర సమస్యలను వినియోగదారులు రాతపూర్వకంగా అందజేస్తే వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

వర్షాకాల సమస్యలపై ప్రత్యేక దృష్టి

వర్షాకాలంలో పంట పొలాల్లో దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలను వెంటనే పునరుద్ధరించాలని విద్యుత్‌ అధికారులకు సూచించారు. రైతులు ఇబ్బందులు పడకుండా విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు.

అదేవిధంగా ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్‌ వైర్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వర్షాకాలంలో ఇళ్లపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ వైర్లను గుర్తించి అవసరమైన చోట తొలగించడం లేదా సురక్షితంగా మార్చడం ద్వారా ప్రమాదాలను నివారించాలని తెలిపారు.

రాతపూర్వకంగా ఫిర్యాదులు అందజేయాలి

విద్యుత్‌ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకే ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ను ఏర్పాటు చేసినట్లు చైర్‌పర్సన్‌ చావాన్‌ జయవంత్‌రావు, మెంబర్‌ ఫైనాన్స్‌ శ్రీనివాస్‌ తెలిపారు. విద్యుత్‌ బిల్లులు, విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, సరఫరా అంతరాయాలు తదితర సమస్యలు ఉన్న వినియోగదారులు తమ ఫిర్యాదులను రాతపూర్వకంగా అందజేయాలని సూచించారు.

దీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను కూడా విద్యుత్‌ అదాలత్‌ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తలమడుగు మండల విద్యుత్‌ శాఖ ఏఈ దేవల్ల శ్రీనివాస్‌, విద్యుత్‌ శాఖ అధికారులు, రైతులు, విద్యుత్‌ వినియోగదారులు, రైతులు. శ్రీనివాస్ రెడ్డి వెంకట్‌రెడ్డి, స్వామిరెడ్డి, జువ్వక నర్సింగ్‌, రూపేష్‌గౌడ్‌, సాయిగౌడ్‌,ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.