manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 10:27 am Editor : manabharath

రానుంది బహుజన రాజ్యాధికారం..

కార్యకర్తల త్యాగనిరతితోనే బహుజన రాజ్యాధికారం సాధ్యం

బీఎస్పీ కార్యకర్తలు బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలి: జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం

ఆదిలాబాద్, మన భారత్ ఆగస్టు,10: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కార్యకర్తల త్యాగనిరతి, నిజాయితీ, నిబద్ధతతో కూడిన కృషితోనే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని బీఎస్పీ చీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రత్నపురం రమేష్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కమిటీల పనితీరును సమీక్షించారు.

సమావేశం ప్రారంభంలో మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, ఛత్రపతి సాహూజీ మహరాజ్, బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మాన్యవర్ కాన్షీరాం చిత్రపటాలకు పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి నిషాని రామచంద్రం మాట్లాడారు.

మహనీయుల త్యాగాలే బహుజన ఉద్యమానికి బలం

మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, ఛత్రపతి సాహూజీ మహరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన సామాజిక పోరాటాలు బహుజన ఉద్యమానికి బలమైన పునాది వేశాయని నిషాని రామచంద్రం అన్నారు. అనంతరం మాన్యవర్ కాన్షీరాం తన జీవితాన్ని బహుజన ఉద్యమానికి అంకితం చేసి రాజ్యాధికారం దిశగా ఉద్యమాన్ని నడిపారని పేర్కొన్నారు.

బహుజన్ సమాజ్ పార్టీ అధినాయకురాలు బెహన్‌జీ నాయకత్వంలో ఉద్యమం కొనసాగుతోందని, మహనీయుల త్యాగాలు, ఆలోచనలు, పోరాట స్ఫూర్తిని కార్యకర్తలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలను రాజకీయంగా చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు.

బూత్ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం

బహుజన రాజ్యాధికార సాధన కోసం పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిషాని రామచంద్రం అన్నారు. ప్రతి గ్రామం, ప్రతి బూత్ స్థాయికి పార్టీ కమిటీలను విస్తరించి ప్రజలతో నిరంతరం మమేకం కావాలని కార్యకర్తలకు సూచించారు.

పార్టీ అంతర్గత నిర్మాణాలే ఉద్యమానికి పునాదులని, బూత్ స్థాయి కమిటీల బలోపేతంతోనే ప్రజల్లో రాజకీయ చైతన్యం మరింత విస్తరిస్తుందని అన్నారు. బహుజన ఉద్యమం ద్వారా రాజకీయ అవగాహన పెంపొందించి, ప్రలోభాలకు లొంగని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

మతం, కులం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శ

ప్రస్తుత రాజకీయాల్లో ప్రజలను మతం, కులం పేరుతో విభజిస్తూ రాజకీయ ప్రయోజనాలు పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని నిషాని రామచంద్రం విమర్శించారు. బహుజనుల ఐక్యతతో పాటు ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగని రాజకీయ చైతన్యం పెంపొందించుకోవడం ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని అన్నారు.

బెహన్‌జీ నాయకత్వంలో పార్టీని గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పటిష్టంగా నిర్మించి, ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యం తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు. సమానత్వం, సామాజిక న్యాయం ఆధారంగా సమాజ నిర్మాణం కోసం బహుజన ఉద్యమాన్ని మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు.

ఈ జిల్లా సమీక్షా సమావేశంలో జోన్ ఇంచార్జ్ కల్లెపెల్లి రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు సంపంగి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి కామిరే పోచెట్టి, ఆదిలాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు శ్రీహరి, బోథ్ అసెంబ్లీ అధ్యక్షుడు వెంకటేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.